మహిళంటే కేవలం పిల్లల్ని కనడానికి మాత్రమేనని, వారు పదవులు చేపట్టడానికి పనికిరారంటూ తమ సహజ లక్షణాన్ని బయటపెట్టుకున్నారు. అఫ్గన్లో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో మహిళలకు చోటుదక్కకపోవడంపై పలుచోట్ల మహిళలు నిర్వహిస్తున్న ఆందోళనను పట్టించుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఎవరో కొందరు ఆందోళన చేస్తే అఫ్గన్ మహిళలందరూ తరఫున చేసినట్టు కాదని తాలిబన్ అధికార ప్రతినిధి సయ్యద్ జక్రూల్లా హషీమ్ గురువారం ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘క్యాబినెట్లో మహిళ అవసరం లేదు.. ఒక మహిళ మంత్రి అయితే.. ఆమె మెడపై మోయలేని భారం ఉంచినట్లుగా ఉంటుంది.. ఇస్లామిక్ నిబంధనలకు ప్రకారం పిల్లలను కనడం..పెంచడం వారి విధి.. నిరసనలు చేస్తున్నవారు అఫ్గన్లో మహిళలందరికీ ప్రాతినిధ్యం వహించినట్టు కాదు’ అని టోలో న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. సమాజంలో మహిళలు సగభాగం కాదా? అని టోలో న్యూస్ ప్రెజెంటర్ ప్రశ్నించగా.. ‘మహిళలను తాలిబన్లు ఎప్పుడూ సగభాగంగా పరిగణించలేదు.. అది ఏ విధమైన సగం? ఇక్కడ సగభాగం తప్పుడు అర్ధంలో సూచించిస్తోంది’ హషీమ్ సమాధానం ఇచ్చారు. తమ హక్కులు, స్వేచ్ఛను కాలరాయవద్దని, మహిళలకు ప్రభుత్వంలో చోటుకల్పించాలంటూ పలు ప్రాంతాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళనలపై తాలిబన్లు ఉక్కుపాదం మోపుతున్నారు. మహిళలపై విచక్షణారహితంగా దాడిచేసి, కర్రలతో కొడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు పలు మీడియాలు ప్రసారం చేస్తున్నాయి. కాబూల్ను ఆక్రమించుకున్న తర్వాత ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. మేం మా హక్కులను కోరుకుంటున్నాం.. తమపై హింసాత్మక ఘటనకు పాల్పడినా పోరాటం ఆగదని ఓ మహిళ స్పష్టం చేసింది. ఆగస్టు 15న కాబుల్ను ఆక్రమించుకున్న తాలిబన్లు.. సంక్షోభం మధ్య ఇటీవలే ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. గతంలో ఇచ్చిన ఎన్నో హామీలు.. క్యాబినెట్ కూర్పులో కనపడలేదు. తాలిబన్యేతర సభ్యులను చేర్చుకోవాలన్న అంతర్జాతీయ సమాజం డిమాండ్ను పక్కనపెట్టేశారు. తాలిబన్ల అరాచక పాలనతో అఫ్గన్ సంక్షోభం మరింత ముదిరింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కొద్ది రోజులకే మహిళల నిరసనలపై ఉక్కుపాదం మోపారు. జర్నలిస్టులను చితకబాదారు. ఓవైపు కఠినమైన ఇస్లాం చట్టాలతో దేశాన్ని పాలిస్తూనే.. మరోవైపు ప్రపంచదేశాలతో జట్టుకట్టాలని తాలిబన్లు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ప్రకటించి.. కేబినెట్లో మార్పులు చేసేందుకు ఇంకా అవకాశముందనే సంకేతాలు పంపించారు. ప్రభుత్వాన్ని గుర్తించకుండానే తమతో వ్యాపార అంశాలపై చర్చించవచ్చని సూచించారు.
from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/2X90nja
0 Comments