పాక్ సరిహద్దుల్లో రాజ్‌నాథ్, నితిన్ గడ్కరీ.. దేశంలో తొలి ఎయిర్‌స్ట్రిప్ ప్రారంభం

సరిహద్దుల్లో యుద్ధ విమానాలను అత్యవసరంగా దింపేందుకు వీలుగా దేశంలోనే తొలి ఎయిర్‌ స్ట్రిప్‌ను నిర్మించారు. పాక్ సరిహద్దుకు 40 కిలోమీటర్ల దూరంలో రాజస్థాన్‌లోని అగడావా వద్ద ఈ ఎయిర్‌ స్ట్రిప్‌ను ఏర్పాటుచేశారు. పూర్తిగా జాతీయ రహదారి-925 ఏ పైనే నిర్మించిన దేశంలోనే తొలి ఎయిర్‌ స్ట్రిప్‌ గురువారం ప్రారంభమయ్యింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖల మంత్రి నితిన్‌ గడ్కరీలు సంయుక్తంగా దీనిని ప్రారంభించారు. రాజస్థాన్‌ బర్మేర్-జాలోర్‌ జిల్లాలోని సరిహద్దుకు అత్యంత సమీపంలో ఈ ఎయిర్‌ స్ట్రిప్‌ను కేవలం 19 నెలల్లోనే నిర్మించడం విశేషం. ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర ఉపరితల రవాణా మంత్రి మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఇటువంటి ఎయిర్‌ స్ట్రిప్‌లను రోజుల వ్యవధిలోనే నిర్మాణం పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. ‘నిన్న గౌరవ వైమానికదళ అధిపతి నా వద్దకు వచ్చారు.. బర్మేర్‌లో ఎయిర్‌స్ట్రిప్‌ను ఏడాదిన్నరలోనే పూర్తిచేశామని చెప్పారు.. మంచి నాణ్యతతో ఏడాదిన్నర పట్టిన ఈ నిర్మాణాన్ని కేవలం 15 రోజుల్లోనే పూర్తిచేయగలం అని ఈ సమయంలో ఆయనకు నేను చెప్పాను.. ఏదైనా ఆలోచన మొదలైనప్పుడు భయాందోళనలు తలెత్తుతాయి. కానీ (మేము) రక్షణ మంత్రిత్వ శాఖ, వైమానిక దళం నుంచి వచ్చిన మద్దతుకు సంతోషిస్తున్నాం.. ఆ ధైర్యమే మూడు కి.మీ పొడవైన రోడ్-కమ్-ఎయిర్ స్ట్రిప్ విజయవంతంగా ప్రారంభించడానికి దారితీసింది’ అని అన్నారు. ‘ఈ ఎయిర్‌‌స్ట్రిప్ నిర్మాణం భారత్‌కు కొత్త బలాన్ని ఇచ్చింది.. పశ్చిమ సరిహద్దులో ప్రాథమిక మౌలిక సదుపాయాల కల్పన మరింత సులభతరమవుతుంది.. జాతీయ భద్రతను బలోపేతం చేస్తుంది’ అని అన్నారు. కేవలం యుద్ధ సమయాల్లోనే కాదు, ప్రకృతి వైపరీత్యాల సమయంలోనూ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా , జాతీయ రహదారులు అథారిటీ, నిర్మాణ సంస్థలకు రాజ్‌నాథ్ అభినందనలు తెలియజేశారు. ప్రారంభోత్సవానికి ముందు ట్రయల్స్ నిర్వహించిన అధికారులు.. విమానాలను దింపే ప్రక్రియ బుధవారం పరిశీలించారు. మిగ్‌, సుఖోయ్‌, హెర్క్యులస్‌ యుద్ధ విమానాలను దింపడంపై రిహార్సల్స్‌ జరిపారు. ఉదయం వైమానిక దళం అధికారుల పర్యవేక్షణలో తొలిసారి ఈ స్ట్రిప్‌పై హెర్క్యులస్‌ విమానాన్ని విజయవంతంగా దింపి.. ఆ తర్వాత అగస్టా హెలికాప్టర్‌తోపాటు సుఖోయ్‌, మిగ్‌లను ల్యాండింగ్‌ చేశారు. ఈ రిహార్సల్స్‌ మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగింది. మొత్తం 3 కిలోమీటర్ల పొడవు, 33 మీటర్ల వెడల్పున్న ఈ ఎయిర్‌‌స్ట్రిప్‌ను భారత్‌మాలా ప్రాజెక్టు కింద రూ.32.95 కోట్ల ఖర్చుతో నిర్మించారు. జాతీయ రహదారికి ఇరువైపులా విమానాలను నిలిపేందుకు వీలుగా పార్కింగ్‌ లాట్‌ కూడా ఏర్పాటుచేశారు. ఇక్కడే ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ వ్యవస్థ కూడా ఉంది. ఇలాంటివి దేశవ్యాప్తంగా మరో 12 నిర్మించేందుకు కేంద్రం సిద్ధమయ్యింది. అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో తొలి ‘టచ్ అండ్ గో’ ఆపరేషన్ గురువారం మధ్యాహ్నం ప్రారంభమయ్యింది.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/3BYOf34

Post a Comment

0 Comments