తాలిబన్లకు మద్దతు కూడగట్టే ప్రయత్నం.. రష్యా, చైనా సహా పలు దేశాలతో పాక్ రహస్య భేటీ

తాలిబన్ల నేతృత్వంలోని అఫ్గన్‌ ప్రభుత్వ ఏర్పాటులో పాకిస్థాన్ జోక్యం చేసుకున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. తాజాగా, తాలిబన్లతో సత్సంబంధాలు కొనసాగించేలా పలు దేశాలను ఒప్పించడానికి పాకిస్థాన్ రంగంలోకి దిగినట్టు సమాచారం. ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ () చీఫ్ పలు దేశాల ఉన్నతాధికారులతో శనివారం రహస్యంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. చైనా, రష్యా, ఇరాన్, కజకిస్థాన్‌, తజికిస్థాన్‌, తుర్కెమెనిస్థాన్‌ దేశాల నిఘా అధికారులతో ఐఎస్‌ఐ డైరెక్టర్‌ జనరల్‌ ఫయాజ్‌ హమీద్‌ ఇస్లామాబాద్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. తాలిబన్ల పిలుపు మేరకు గతవారం కాబుల్‌ వెళ్లి వచ్చిన తర్వాత ఫయాజ్‌ హమీద్‌ ఈ భేటీ ఏర్పాటు చేయడం పలు ఊహాగానాలకు తెరలేపుతోంది. నిఘా వర్గాల నివేదిక ప్రకారం.. అఫ్గన్‌లోని ప్రస్తుత పరిస్థితులపై ఆయా దేశాలు చేపట్టబోయే చర్యలు సహా తాలిబన్ల ప్రభుత్వంతో పాక్‌ ఏర్పరచుకునే సత్సంబంధాలపై చర్చించినట్లు సమాచారం. అఫ్గన్‌తో ఆర్థిక, వాణిజ్య పరమైన సంబంధాలపై సుదీర్ఘ చర్చలు సాగించినట్టు తెలుస్తోంది. అయితే, రష్యా మినహా మిగతా ఐదు దేశాల విదేశాంగ మంత్రులు ఇదే అంశంపై గతవారం విస్తృత చర్చలు నిర్వహించారు. పాక్ మీడియా సామా టీవీ ప్రకారం.. అఫ్గన్‌ను ఒంటరిగా వదిలేయమని, సమస్యల పరిష్కారానికి సహకరిస్తామని సమావేశంలో పాల్గొన్న దేశాల అధికారులు హామీఇచ్చారు. ఈ పరిణామాలపై అఫ్గన్ నిపుణులు, రాజకీయ పరిశీలకులు ఆసక్తికరమైన దృక్పథాన్ని వెల్లడిస్తున్నారు. వాస్తవానికి ఆగస్టులో అష్రాఫ్ ఘనీ ప్రభుత్వ వ్యతిరేకంగా తాలిబాన్ల మెరుపు దాడుల వెనుక పాక్ హస్తం ఉన్నట్టు స్పష్టమవుతోందని వ్యాఖ్యానించారు. అన్ని అంశాలలో తాలిబాన్‌లకు పాక్ సహాయం చేస్తోందని వారు చెప్పారు. తాలిబన్లకు పాకిస్థాన్‌, చైనాతోపాటు మరికొన్ని దేశాలు మొదటి నుంచి మద్దతిస్తున్నాయి. తాలిబన్లకు అనుకూలంగానే ప్రకటనలు చేస్తున్నాయి. కొన్ని దేశాలు తాలిబన్లకు ఆయుధాలు సైతం సరఫరా చేశాయని, ఆర్థిక సాయం అందజేశాయని అంతర్జాతీయ మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. అఫ్గనిస్థాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లు సెప్టెంబరు 7న తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. క్యాబినెట్ ప్రమాణస్వీకారానికి సెప్టెంబరు 11గా ముహూర్తం ఖరారుచేసి.. ఈ కార్యక్రమానికి పాకిస్థాన్‌, చైనా, రష్యా, టర్కీ, ఖతార్‌, ఇరాన్‌‌లకు ఆహ్వానం పంపారు. అయితే, అమెరికా ఒత్తిడి సహా పలు కారణాలతో ఈ కార్యక్రమాన్ని రద్దుచేశారు. అమెరికాలో ట్విన్ టవర్స్‌పై అల్‌ఖైదా ఉగ్రవాదులు దాడికి పాల్పడిన సెప్టెంబరు 11నే ప్రమాణస్వీకారం చేస్తామని తాలిబన్లు ప్రకటించడంతో అగ్రరాజ్యం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రష్యా కూడా ఆ రోజున కార్యక్రమాన్ని తప్పుబట్టింది. అమెరికా, తాలిబన్ల ఒప్పందంలో మధ్యవర్తిత్వం వహించిన ఖతార్‌కు ఇదే విషయం స్పష్టం చేసింది. అటు, అమెరికా కూడా ఖతార్‌ను ఒత్తిడి చేయడంతో ఆ రోజున కార్యక్రమానికి రాలేమని తాలిబన్లకు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/3nuhNBN

Post a Comment

0 Comments