కరోనా ముసుగులో మూఢనమ్మకాలు... 400గొర్రెల బలి

ప్రపంచాన్ని ఓ వైపు కరోనా పట్టి పీడిస్తుంటే.. మరోవైపు అదేస్థాయిలో మూఢనమ్మకాలు కూడా ప్రబలుతున్నాయి. కరోనా పోతుందని జనం గుడ్డిగా నమ్మి పూజలు, నరబలులు ఇస్తున్నారు. తాజాగా జార్ఖండ్ ప్రజలు వింత చర్యకు పాల్పడ్డారు. రాష్ట్రంలోని కోడెర్మా జిల్లాలో కూడా ఇలాంటి ఘటన వెలుగు చూసింది. మొక్కుల పేరుతో ఏకంగా 400 గొర్రెలను ఆలయంలో బలి ఇచ్చారు. ఇలా చేయడం ద్వారా వైరస్ తమ ఊరికి రాకుండా ఉండటంతో పాటు మంచి జరుగుతుందని గ్రామస్థులు పేర్కొన్నారు. దీంతో ఈ సామూహిక బలి విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఉర్వాన్ గ్రామంలోని అమ్మవారి ఆలయంలో కరోనా శాంతి పూజలు నిర్వహించారు. గ్రామస్థులంతా అక్కడికి చేరుకొని 400 గొర్రెలు, కోళ్లను బలి ఇచ్చారు. ఆ సమయంలో ఎవరూ భౌతిక దూరం పాటించలేదు. ఒకరిపై ఒకరు పడుతూ.. పూజా కార్యక్రమాలు చేపట్టారు. దీంతో నిర్వాహకుల తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు వైరస్ వ్యాప్తి చెందుతుందని చెబుతున్నా లెక్క చేయకుండా ప్రజలను ఇలా అమాయకులను చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై అధికారులు చర్యలు కూడా చేపట్టారు. అయితే గ్రామస్థులు మాత్రం శాంతి పూజల వల్ల తమ గ్రామానికి వైరస్ నుంచి విముక్తి కలుగుతుందని నమ్ముతుండటం విశేషం. ఇటీవలే ఒడిశాలోకూడా ఓ వ్యక్తి ఇలాగే చేశాడు. కరోనా పోతుందని ఆలయంలో పూజరి నరబలి ఇచ్చాడు. కటక్ జిల్లా నర్సింగ్ పూర్ లో బ్రాహ్మణిదేవి ఆలయంలో నరబలి ఇచ్చారు. కరోనా నుంచి ప్రజలకు విముక్తి కలగాలని ఆలయ అర్చకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన తెలిసి ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. అర్చకుడు సంసారి హోజాను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2AVjxxK

Post a Comment

0 Comments