దేశంలో 258కి చేరిన కరోనా కేసులు.. 35 లక్షల కూలీలకు యూపీ ప్రభుత్వం బంపరాఫర్

కరోనా వైరస్‌ మహమ్మారి భారత్‌లో రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే 22 రాష్ట్రాలలో వ్యాపించిన ఈ వైరస్ నలుగుర్ని పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా మధ్యప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లలో కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో దేశంలో బాధితుల సంఖ్య 258కు చేరుకుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వీరిలో 39మంది విదేశీయులు కాగా, 219మంది భారతీయులు ఉన్నారు. కరోనా బారినపడ్డవారిలో 23మంది ఇప్పటికే కోలుకోగా మరో 231 మంది ప్రస్తుతం ప్రత్యేక పరిశీలనలో ఉన్నారు. ఈ వైరస్‌ తీవ్రత అంతకంతకూ అధికం కావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట చర్యలు చేపట్టాయి. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా దేశ ప్రజలకు సూచించారు. ఉత్తరప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య 33కు చేరుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్, మే నెలకు సంబంధించిన వృద్ధాప్యపు, వితంతు, దివ్యాంగుల పెన్షన్లు ఏప్రిల్‌లోనే అందజేయాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. దీంతో, 83 లక్షల మందికి ఏప్రిల్‌లోనే పింఛన్లు అందనున్నాయి. అలాగే, ఇప్పటి వరకూ వేతనాలు అందని ఉపాధి హామీ పథకం కార్మికులకు కూడా మార్చిలోనే చెల్లిస్తామని తెలిపారు. రేషన్ కార్డు లేకపోయినా ఉపాధి హామీ కార్డులు ఉంటే ప్రాధాన్యత ఇస్తామని, వారికి 20 కిలోల గోధుమలు, 15 కిలోల బియ్యం ఉచితంగా అందజేస్తామని హామీ ఇచ్చారు. మొత్తం 15 లక్షల రోజువారీ కూలీలు, 20.37 భవన నిర్మాణ కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1,000 చొప్పున చెల్లించనున్నారు. రోజువారీ అవసరాల కోసం ఈ మొత్తం చెల్లిస్తామని తెలిపారు. వైరస్ భయంతో మాల్స్, థియేటర్స్, రెస్టారెంట్లు, హోటల్స్‌ను మూసివేయడంతో చాలా మంది ఉపాధికి దూరం కావడంతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మొత్తాన్ని నేరుగా బ్యాంకు ఖాతాలకు బదిలీచేస్తారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో 33 కరోనా కేసులు నమోదవడంతో తమ మంత్రులను ఇళ్లనుంచే పనిచేయాలని ఆరాష్ట్ర ముఖ్యమంత్రి యోగీ ఆధిత్యనాథ్‌ ఆదేశించారు. యూపీ ఆరోగ్యశాఖ మంత్రి హోం క్వారంటైన్‌లో ఉంటున్నట్లు స్వయంగా ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరిస్థితిపై వైద్య, ఆరోగ్యశాఖ శనివారం బులెటిన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3 కరోనా కేసులు నమోదయ్యాయి. 135 మంది నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపగా.. వారిలో 108 మందికి కరోనా నెగిటివ్‌ అని తేలింది. మిగతా 24 రక్త నమూనాల కోసం నిరీక్షిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఇప్పటివరకు 1,006 మంది అనుమానితులకు వైద్యపరీక్షలు నిర్వహించారు. 28 రోజుల పరిశీలన తర్వాత 259 మందిని ఇళ్లకు పంపినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. 711 మంది ఇళ్లలోనే స్వీయ నిర్బంధంలో ఉన్నారు. ప్రస్తుతం 36 మంది వివిధ ఆసుపత్రుల్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3a9jvyX

Post a Comment

0 Comments