Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Friday, 16 July 2021

ముగ్గురు కుమార్తెలకూ ఒకేసారి పెళ్లి చేసిన సీఎం.. ఈ అల్లుళ్లు నిజంగా పెట్టి పుట్టారు!

ఈ ముగ్గురు పెళ్లి కొడుకులూ పెట్టి పుట్టారు. ఏకంగా ముఖ్యమంత్రికే అల్లుళ్లయ్యారు. ముఖ్యమంత్రికి మాత్రం అల్లుళ్లు రారా.. అని అడగొచ్చు. కానీ, ఈ వరులకు ఓ ప్రత్యేకత ఉంది. సీఎం ఈ ముగ్గురినీ ఒకేసారి తన అల్లుళ్లుగా చేసుకున్నారు. తన ముగ్గురు దత్త పుత్రికలకు ఇచ్చి వివాహం జరిపించారు. అవును.. మీరు విన్నది నిజమే. సీఎం శివరాజ్.. తన దత్తపుత్రికలను ఏ లోటూ రాకుండా పెంచి పెద్ద చేసి, ఇప్పుడు ఓ ఇంటి వాళ్లను కూడా చేశారు. మధ్యప్రదేశ్‌లోని విదిశా పట్టణంలోని గణేష్ ఆలయంలో ఈ ముగ్గురు అమ్మాయిలకు ఒకేసారి వివాహం జరిపించారు. సంప్రదాయ పద్ధతిలో సాదాసీదాగా జరిగిన ఈ వేడుకలో శివరాజ్ సింగ్, ఆయన సతీమణి సాధన.. వరుల కాళ్లు కడిగి కన్యాదానం చేశారు. అప్పగింతల వేళ సాధన భావోద్వేగానికి గురయ్యారు. అశ్వాలపై వచ్చిన పెళ్లికుమారులను శివరాజ్ సింగ్, సాధన దంపతులు తిలకందిద్ది ఎదుర్కున్నారు. తమ దత్త పుత్రికలకు భారీగా కట్న కానుకలు ఇచ్చి, బంగారు నగలు చేయించి వివాహం జరిపించారు శివరాజ్ సింగ్ దంపతులు. శివరాజ్ సింగ్ చౌహాన్, సాధన దంపతులు 20 ఏళ్ల కిందట అనాథలైన ఏడుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిల బాధ్యతలను తామే తీసుకుంటామని వాగ్దానం చేశారు. తల్లిదండ్రులు, సంరక్షకులు లేని ఆ పిల్లలను విదిశాలోని సుందర్ సేవా ఆశ్రమం చేరదీసింది. ఆ పిల్లల గురించి తెలుసుకున్న సాధన వారిని దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చారు. నాడు శివరాజ్ సింగ్ చౌహాన్ విదిశా ఎంపీగా ఉన్నారు. తొమ్మిది మంది పిల్లలను దత్తత తీసుకున్న శివరాజ్ సింగ్ దంపతులు ఇప్పటికే నలుగురు అమ్మాయిలు, ఓ యువకుడి పెళ్లి జరిపించారు. తాజాగా మరో ముగ్గురు అమ్మాయిల పెళ్లి జరిపించారు. దత్తపుత్రికల పట్ల తన భార్య సాధన ఎంతో ప్రేమ కనబరిచేవారని శివరాజ్ తెలిపారు. సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన శివరాజ్ సింగ్.. 16 ఏళ్లకే బీజేపీ అనుబంధ సంస్థ ఏబీవీపీలో విద్యార్థి నాయకుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగారు. 1991లో విదిశా పార్లమెంటరీ స్థానానికి అటల్ బిహారీ వాజ్‌పాయ్ రాజీనామా చేయడంతో ఆ అవకాశం శివరాజ్ సింగ్‌కు దక్కింది. పిన్న వయసులోనే పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. 2005లో బాబూలాల్ గౌర్ సీఎం పదవికి రాజీనామా చేయడంతో.. శివరాజ్ సింగ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2008, 2013 ఎన్నికల్లో పార్టీకి ఘన విజయం కట్టబెట్టి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం నాటకీయ పరిణామాల అనంతరం నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో సుదీర్ఘ కాలం సీఎంగా పనిచేసిన వ్యక్తిగా శివరాజ్ రికార్డు సృష్టించారు. తన బాల్యమంతా నర్మదా నదీ తీరంతో పెనవేసుకున్న శివరాజ్ సింగ్.. చదువుల్లోనే చురుగ్గా ఉండేవారు. శివరాజ్ సింగ్, సాధన దంపతులకు కార్తికేయ, కునాల్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. తన దత్త కుమార్తెల పెళ్లి గురించి ట్విటర్ ద్వారా వెల్లడించిన సీఎం శివరాజ్ సింగ్.. భావోద్వేగంగా పోస్టు చేశారు. ‘ఈరోజు నా జీవితంలో ముఖ్యమైన రోజు. తండ్రిగా నా బాధ్యతలు నిర్వహించాను. కన్యాదానం చేయడం ఎలాంటి తండ్రికైనా గొప్ప విషయమే కదా.. నా కుమార్తెల జీవితం ఎలాంటి లోటు లేకుండా, సంతోషంగా సాగాలని కోరుకుంటున్నా’ అని శివరాజ్ ట్వీట్ చేశారు. దత్తకుమార్తెల పెళ్లి సందర్భంగా శివరాజ్ సింగ్ తన నివాసంలో మూడు మొక్కలను నాటారు. భవిష్యత్తులో ఆ చెట్ల నీడన కూర్చొని, తన కుమార్తెల జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటానంటూ ట్వీట్ చేశారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3Bb8CL2

No comments:

Post a Comment