సెక్యూరిటీ గార్డు నుంచి డాక్టర్‌గా అవతారం.. ఐదుగురి ప్రాణాలు పోవడంతో బయటపడ్డ బండారం

సెక్యూరిటీ గార్డు నుంచి డాక్టర్‌గా అవతారం ఎత్తాడు.. కొన్నేళ్లుగా వైద్యుడిగా చలామణి అవుతూ వచ్చాడు. అతని వైద్యానికి ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంతో బండారం బయటపడింది. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. ముర్బాద్‌లో నకిలీ వైద్యుడిని పోలీసులు పట్టుకున్నారు. ఎలాంటి మెడికల్ డిగ్రీ లేకుండా సమీప ప్రాంతాల్లోని గిరిజనులకు వైద్యం చేయడంతో అతనిపై కేసు నమోదైంది. పాండురంగ్ ఘోలాప్ (72) అనే వ్యక్తి మొదట ప్రైమరీ హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేసేవాడు. 2009లో ఆ ఉద్యోగం నుంచి రిటైర్డ్ అయ్యాడు. పదవీ విరమణ తర్వాత ఏకంగా సొంత క్లీనిక్‌ను పెట్టి అక్కడున్న గిరిజనులకు సొంత వైద్యం చేయడం మొదలుపెట్టాడు. వారంతా పాండురంగ్ నిజంగానే డాక్టర్ అనుకుని ఆయన దగ్గరకు వెళ్లేవారు. అలా చాలా ఏళ్లు గడిచాయి. అయితే ఇటీవల కాలంలో ఆయన అందించిన వైద్యానికి కొంతమంది చనిపోయారు. దాంతో కొంతమంది పాండురంగ్ ఘోలాప్‌పై కేసు పెట్టారు. దీంతో రంగంలోకి దిగిన తోకవాడ పోలీసులు దర్యాప్తు చేసి విషయం తెలుసుకుని పాండురంగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇలాంటి నకిలీ వైద్యులు ఈ ప్రాంతంలో చాలా మంది ఉన్నారని అక్కడ సామాజిక కార్యకర్తలు అంటున్నారు. పాండురంగ్ వైద్యానికి ఈ వారంలో ఐదుగురు బలి అయ్యారని, అందులో ఒక గర్భిణీ కూడా ఉందని చెప్పారు. పాండురంగ్ వారికి తప్పుడు వైద్యం చేయడంతో ప్రాణాలు కోల్పోయారన్నారు. ఇక్కడున్న గిరిజనులు థానే సివిల్ ఆస్పత్రికి వెళ్లలేరని, దాని వల్ల నకిలీ వైద్యుల బారిన పడుతున్నారని వెల్లడించారు.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://bit.ly/3ubHxGu

Post a Comment

0 Comments