రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా జనవరి 26న ఢిల్లీలోని రాజ్పథ్లో జరిగే వేడుకల్లో తెలుగు రాష్ట్రాల శకటాలకు ఈసారి చోటు దక్కలేదు. ఈ ఏడాది గణతంత్ర వేడుకలకు మొత్తం 12 రాష్ట్రాలు, 9 శాఖలకు చెందిన శకటాలే రిపబ్లిక్ డే కవాతులో పాలుపంచుకోనున్నాయి. అరుణాచల్ప్రదేశ్, హరియాణా, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, జమ్మూ కశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, మేఘాలయా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చెందిన శకటాలే రిపబ్లిక్ డే వేడుకల్లో కవాతు చేస్తాయని కేంద్ర రక్షణశాఖ తెలిపింది. పొరుగున ఉన్న చైనా, పాకిస్థాన్లతో ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఆయా దేశాలతో సరిహద్దులను పంచుకుంటున్న అరుణాచల్ ప్రదేశ్, కశ్మీర్, పంజాబ్ రాష్ట్రాలకు పరేడ్లో చోటు దక్కడం గమనార్హం. మరోవైపు విద్య-నైపుణ్యాభివృద్ధి, పౌర విమానయానం, న్యాయశాఖ సహా మొత్తం 9 శాఖలకు చెందిన శకటాలు రిపబ్లిక్ డే ప్రదర్శనల్లో పాల్గొననున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన అమృతోత్సవాల థీమ్తో కూడిన అంశాలను ఈ శకటాలు ప్రదర్శించే అవకాశం ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటకకు మాత్రమే అనుమతి లభించింది. తమిళనాడు శకటానికి కూడా అవకాశం దక్కలేదు. స్వాతంత్య్ర సమరయోధులు వేలునాచ్చియార్, చిదంబరం పిళ్లై ప్రతిమలతో రూపొందించనున్న శకటపు రూపాన్ని నిపుణుల కమిటీకి తమిళనాడు ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికి కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో రిపబ్లిక్ డే వేడుకల్లో స్వాతంత్ర సమరయోధుల ప్రతిమలతో రూపొందించిన ప్రచార శకటాన్ని అనుమతించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రధాని నరేంద్రమోదీకి సోమవారం ఓ లేఖ కూడా రాశారు. దక్షిణాదిలో బీజేపీ అధికారంలో ఉన్న కర్నాటక మినహా తక్కిన అన్ని రాష్ట్రాల ప్రచార శకటాలను రిపబ్లిక్ వేడుకల్లో ఊరేగించడానికి అనుమతి నిరాకరించడం పట్ల తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఈ ఏడాది రిపబ్లిక్ వేడుకల్లో కవాతు ప్రారంభమయ్యే సమయాన్ని ఉదయం 10 గంటలకు బదులు 10:30 గంటలకు మార్చినట్లు అధికారులు వెల్లడించారు. పొగ మంచు ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో ఈ మార్పు చేశారు. ఈ ఏడాది ఫ్లైపాస్ట్లో విమానాలు, హెలికాప్టర్లు 15 విభిన్న భంగిమల్లో ఎగిరి కనువిందు చేయనున్నాయి.
from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/3nZQm2r
0 Comments