Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Tuesday, 12 November 2019

అనాథ జంటను విడదీసిన విధి.. స్పందించని సమాజం.. తోపుడు బండిలో అంతిమ యాత్ర..

పేదరికం, అనాథగా బతకడం ఎంతో శాపమో చాటి చెప్పే ఘటన ఇది. వేలాది మంది జనం మధ్య బతుకుతున్నా.. అయ్యో పాపం అనలేని ఈ సమాజంలో బతకడమే కాదు.. చావడం కూడా ఎంతటి కష్టమో తెలియజెప్పే ఉదంతమిది. ఓ పేద మహిళ చనిపోతే.. గౌరవ ప్రదమైన రీతిలో అంత్యక్రియలు నిర్వహించలేకపోయిన ఓ భర్త దీనావస్థ ఇది. మనసున్న ప్రతి మనిషిని కదిలించే ఈ ఘటన కర్నూలు జిల్లా మహానందిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా డోన్‌కు చెందిన నాగరాజు నిరుపేద, ఎవరూ లేని అనాథ. చిత్తు కాగితాలు ఏరుకొని జీవితం సాగించేవాడు. వరంగల్ జిల్లాకు చెందిన సుజాత కూడా అనాథే. ఆమె కూడా చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవితం సాగించేది. అనుకోకుండా తారసపడ్డ వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకొని పెళ్లాడారు. ఏడాదిన్నర పాటు వీరి దాంపత్యం సజావుగానే సాగింది. ఇద్దరూ కలిసి కాగితాలు ఏరుకుంటూ.. జీవితాన్ని గడిపేవారు. ఈ క్రమంలో ఒక ఊరి నుంచి మరో ఊరికి వలస వెళ్తూ కొద్ది రోజుల క్రితం ప్రాంతానికి చేరుకున్నారు. చేతిలో డబ్బులు లేకున్నా.. ఒకరికి తోడుగా మరొకరు ఆనందంగా బతికేవారు. కానీ ఈ మధ్యే సుజాతకు జ్వరం వచ్చింది. వైద్యం చేయించే స్థోమత లేకపోవడంతో.. ఆమె ప్రాణాలు వదిలింది. జీవితాంతం తోడుగా ఉంటుందనుకుంటున్న భార్య ఆకస్మికంగా ప్రాణాలు వదలడంతో.. ఏం చేయాలో నాగరాజుకు పాలుపోలేదు. ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకొంటూ.. బాధను భరిస్తూ.. సాయం కోసం అర్థించాడు. కొందరు సాయం చేసినా.. వచ్చిన డబ్బు అంత్యక్రియలు నిర్వహించడానికి సరిపోలేదు. ఇక లాభం లేదనుకొని దుఃఖాన్ని దిగమింగుకుంటూ.. శ్మశానంలో ఖననం చేయడం కోసం భార్య మృతదేహాన్ని భుజానికి ఎత్తుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మహానంది దేవస్థానం అధికారులు.. ఆమె మృతదేహాన్ని తరలించడానికి చెత్తను తరలించే తోపుడు బండి.. ఓ పలుగు, పార ఇచ్చారు. మరో వ్యక్తి నాగరాజుకు తోడు రాగా.. అతడితో కలిసి తోపుడ బండిలో భార్య శవాన్ని వేసుకొని.. శ్మశానికి తీసుకెళ్లి భార్య శవాన్ని పూడ్చిపెట్టాడు. భార్య చనిపోయినందుకు ఆ నిరుపేద ఎంతగా బాధపడ్డాడో తెలీదు కానీ.. ఆమె గౌరవప్రదమైన రీతిలో ఈ లోకం నుంచి సాగనంప లేకపోయినందుకు అతడి మనసు తల్లడిల్లి ఉంటుంది. తోటి మనిషి చనిపోతే.. అంత్యక్రియలు చేయడానికి తోడు రాలేని ఈ సమాజాన్ని చూస్తే.. ఆ పేదోడికి ఏమనిపించిందో గానీ.. మనం మాత్రం కచ్చితంగా సిగ్గుపడాల్సిన విషయం ఇది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2CD7CSJ

No comments:

Post a Comment