కోవిడ్తో మనుషులే కాదు.. జంతువులు చనిపోతున్నాయి. కరోనా సోకడంతో అరుదైన జాతికి చెందిన ఓ చనిపోయింది. అమెరికాలోని ఇల్లి నాయిస్లో ఉన్న మిల్లర్ పార్క్ జూలో.. రైలూ అనే మంచు చిరుత కోవిడ్తో మృతి చెందింది. ఈ విషయాన్ని జూ సిబ్బంది ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో తెలిపారు. మనుషుల నుంచి సోకిన వేరియంట్ వల్లే అది చనిపోయినట్టు అక్కడి జంతు వైద్యులు ధ్రువీకరించారు. 11 ఏళ్ల రైలు కోవిడ్ ప్రేరిత న్యుమోనియాతో పోరాడింది. రైలూను 2011లో ఓక్లహోమా సిటీ జంతు ప్రదర్శన శాల నుంచి ఈ జూకి తీసుకొచ్చారు. రైలూ ఎంతో అందంగా ఉండేదని, దాన్ని చూసేందుకు ప్రజలు ఎక్కువగా జూకి వచ్చేవారని జూ సిబ్బంది గుర్తు చేసుకున్నారు. రైలూతో పాటుగా మరికొన్ని మంచు చిరుతల్లో స్వల్ప కోవిడ్ లక్షణాలు ఉన్నట్టు జూ అధికారులు ప్రకటించారు. వాటి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నామని చెప్పారు. జూలో ఉన్న మిగతా జంతువులకు వెంటనే పరీక్షలు నిర్వహించారు. కాగా 2021 నవంబర్లో నెబ్రాస్కా జూలో మంచు చిరుతలకు కోవిడ్ సోకగా మూడు మంచు చిరుతలు మృత్యువాత పడ్డాయి. అలాగే అమెరికాలో మూడు తెల్ల తోక జింకలకు కరోనా వైరస్ సోకిన దాఖలాలు ఉన్నాయి. ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా అనేక జాతుల జంతువులకు సోకినట్టు నివేదికలు వెలువడ్డాయి. వీటిలోపెంపుడు జంతువులే కాకుండా జూ జంతువులు కూడా ఉన్నాయి. జంతువులకు కోవిడ్ సోకుతున్న విషయాన్ని గుర్తించడంతో వాటికి వ్యాక్సిన్ ఇవ్వాలని కొన్ని దేశాల్లో జూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా మార్చి 2021లో శాన్ డియాగోలోని జూ అధికారులు గొరిల్లాలకు కోవిడ్ వ్యాక్సిన్ను అందించారు.
from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/3Gpvlp0
0 Comments