ముందు డబ్బు.. ఆ తర్వాతే స్నేహం.. పాక్ ముక్కు పిండి పరిహారం వసూలుచేసిన చైనా

పాకిస్థాన్‌‌కు ఆప్త మిత్రుడిగా చెప్పుకునే చైనా.. ఇరు దేశాల మైత్రిని ‘ఐరన్‌ బ్రదర్స్‌ బంధం’అని గొప్పలు పోతుంది. కానీ, డబ్బు విషయానికి వచ్చేసరికి మాత్రం అసలు వెనక్క తగ్గడం ఉండదు. పాక్‌లో దాసు హైడ్రోపవర్‌ ప్రాజెక్ట్ నిర్మాణ పనుల కోసం వెళ్తున్న బస్సుపై జరిగిన ఆత్మాహుతి దాడికి సంబంధించి నష్ట పరిహారాన్ని డ్రాగన్ ముక్కుపిండి వసూలు చేసింది. గతేడాది జులై 21న జరిగిన ఆత్మాహుతి దాడిలో చైనా ఇంజినీర్లు, కార్మికులు సహా 12 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 9 మంది చైనా ఇంజినీర్లు చనిపోయారు. దీంతో బాధిత కుటుంబాలకు పరిహారాన్ని పాక్ నుంచి వసూలు చేయాలని నిర్ణయించింది. 38 మిలియన్‌ డాలర్ల (రూ.282 కోట్లు) పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేసింది. ఉగ్రదాడిలో ఎవరైనా మరణిస్తే చైనా ప్రభుత్వం ఇచ్చే పరిహారం కంటే ఇది దాదాపు రెట్టింపు కావడం గమనార్హం. అసలే పీకల్లోతు ఆర్ధిక కష్టాల్లో కూరుకుపోయిన పాకిస్థాన్‌‌కు..పరిహారం చెల్లింపు తలకుమించిన భారమయ్యింది. ఈ మొత్తం చెల్లించలేమని పాక్ చేతులేత్తయగా.. దాసు డ్యామ్‌ పనులను చైనా నిర్మాణ సంస్థ అర్ధంతరంగా నిలిపివేసింది. తమ డిమాండ్లను నెరవేర్చిన తర్వాతే మళ్లీ పనులు మొదలుపెడతామని తెగేసి చెప్పింది. ప్రపంచ బ్యాంక్‌ సహకారంతో దాసు హైడ్రోపవర్‌ ప్రాజెక్ట్‌ను చైనా నిర్మాణరంగ సంస్థ జెగ్‌హుబా కంపెనీ నిర్మిస్తోంది. నిర్మాణం పనులు 2015లో ప్రారంభం కాగా.. గతేడాది ఆత్మాహుతి దాడి తర్వాత నిలిపివేశారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌పై ఒత్తిడి పెరగడంతో ది ఎకనామిక్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ, పాక్‌ ఆర్థిక మంత్రి షౌకత్‌ తారిన్‌తో భేటీ అయింది. ఆత్మహుతి దాడిలో మరణించిన చైనా ఇంజినీర్లు, కార్మికులకు 11.6 మిలియన్‌ డాలర్లు (రూ.86.32 కోట్లు) చెల్లించాలని నిర్ణయం తీసుకొంది. మరోవైపు, దాసు డ్యామ్ పనులు నిలిచిపోవడంపై చైనా విదేశాంగశాఖ ప్రతినిధి ఝావో లిజియాన్‌ స్పందించారు. కాంట్రాక్టరు డిమాండ్లు చేస్తున్న విషయం తన దృష్టికి రాలేదని.. డ్యామ్‌ పనులు మళ్లీ మొదలయ్యాయని మీడియా సమావేశంలో వెల్లడించారు. గత జులైలో జరిగిన ఈ ఆత్మాహుతి దాడి తీవ్రతను తగ్గించి చూపేందుకు దాయాది ప్రయత్నించింది. తొలుత ఇది గ్యాస్ లీక్ ప్రమాదంగా చిత్రీకరించింది. కానీ, చైనా దర్యాప్తు బృందం ఘటనా స్థలాన్ని సందర్శించి.. ఆత్మాహుతి దాడిగా తేల్చింది. దీంతో ఈదాడి వెనుక భారత నిఘా సంస్థ ‘రా’ఉందని ఆరోపణలు చేస్తూ మరోసారి తప్పించుకునే ప్రయత్నం చేసింది. కానీ, దీనిపై ఎటువంటి ఆధారాలు లేకపోగా.. చివరకు తెహ్రిక్ ఈ తాలిబన్ ఉగ్రవాద సంస్థ హస్తం ఉన్నట్లు తేలింది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలోని దాసు హైడ్రోపవర్ ప్రాజెక్టు నిర్మాణ ప‌నుల‌ కోసం 40 మంది చైనా ఇంజినీర్లు, సర్వేయర్లు, మెకానికల్ సిబ్బందిని తీసుకుని వెళుతున్న బస్సుపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు.శక్తివంతమైన ఐఈడీ పేలుళ్ల ధాటికి బస్సు లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్ర‌మాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 28 మంది గాయపడ్డారు.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/3g8aNWB

Post a Comment

0 Comments