మధ్యప్రదేశ్‌లో మదర్ మిల్క్ బ్యాంక్

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లోని రాణి దుర్గావతి మహిళా ఆస్పత్రిలో మదర్ మిల్క్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ బ్యాంకులో తల్లుల నుంచి పాలను సేకరించి వాటిని నిల్వ చేస్తారు. కొంతమంది పాలిచ్చే మహిళల్లో ఎక్కువ మొత్తంలో పాలు ఉత్పత్తి అవుతాయి. అలాగే తమ పిల్లలకు తగినంత మొత్తంలో అందించలేని వాళ్లు ఉన్నారు. ఎక్కువ మోతాదులో పాలు ఉత్పత్తి అయ్యే మహిళల నుంచి పాలను సేకరించి.. వాటిని పాలు అందని పిల్లలకు అందజేయడమే ఈ బ్యాంకు ఉద్దేశం. ఈ మిల్క్ బ్యాంక్ ద్వారా ఎక్కువ మోతాదులో పాలు ఉత్పత్తి అయ్యే తల్లుల నుంచి పాలను సేకరించి , వాటిని పాశ్చరైజ్ చేసి నిల్వ ఉంచుతామని హెల్త్ సర్వీస్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంజయ్ మిశ్రా తెలిపారు. ఆ పాలను తక్కువ పరిమాణంలో పాలు ఇచ్చే తల్లుల పిల్లలకు అందుబాటులో ఉంచుతామని ఆయన తెలిపారు. ఇలా నిల్వ ఉంచిన పాలు రాణి దుర్గావతి ఆస్పత్రిలో చేరిన రోగులకే పరిమితం కాకుండా ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి వచ్చే రోగులకు కూడా ఉచితంగా అందజేస్తామని చెప్పారు. ఇప్పటికే ఈ మిల్క్ బ్యాంక్ పనులు ప్రారంభమయ్యాయి. ఆరు నెలల్లో పూర్తి చేయనున్నారు. ఈ సెంటర్‌లో తల్లి పాలు సేకరించేందుకు, ఆ పాలు స్టోరేజ్ చేసేందుకు అవసరమైన యంత్రాలు ఏర్పాటు చేస్తారు. కాగా పుట్టగానే తల్లిని కోల్పోయిన పిల్లలకు, అనాథ శిశువులకు ఈ తల్లి పాల బ్యాంకులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇప్పటి వరకూ దేశంలో 18 తల్లి పాల బ్యాంకులున్నాయి. 2008లో ముంబైలోని కామా, ఆల్‌ బ్లెస్ ఆస్పత్రుల్లో తల్లిపాల బ్యాంకును ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో నీలోఫర్ మదర్ మిల్క్ బ్యాంక్ ఉంది. అప్పుడే పిల్లలకు తల్లిపాలు సంజీవినితో సమానమని వైద్య నిపుణులు అంటుంటారు. పుట్టిన బిడ్డకు ఆరు నెలల వరకూ తల్లి పాలు అందాలి. ఆ పాల వల్లే పిల్లల్లో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/31QZb6M

Post a Comment

0 Comments