బొద్దింకలను చూస్తే ఎవరైనా చీదరించుకుంటారు. కొంతమంది వాటిని చూస్తే చాలు భయపడిపోయి దూరంగా పారిపోతారు. ఇంట్లో వంట గదుల్లో తిరిగే బొద్దింకలను తరిమికొట్టేవరకూ ఊరుకోరు. ఏదో ఒకలా బొద్దింకల బెడదను వదిలించుకుంటారు. అలాంటిది ఒకామె బొద్దింకలను కళాత్మకంగా మార్చేసింది. ఇంకా ఇంకా చూడాలనిపంచేలా వాటిని తీర్చిదిద్దింది. చనిపోయిన బొద్దింకలపై అద్భుత చిత్రాలను చిత్రించి ఔరా అనిపించుకుంటుంది. ఫిలిప్పీన్స్ దేశంలో ఉన్న మనీలాలోని కలుకాన్ సిటీకి చెందిన బ్రెండా డెల్గాడో బొద్దింకలపై అద్భుతమైన పెయింటింగ్స్ వేస్తోంది. కుంచెకు రంగులద్ది బొద్దింకలపై రకరకాల చిత్రాలను గీస్తుంది. అలా తనలోని భావాలను వ్యక్తీకరిస్తుంది. గదిలో చనిపోయిన బొద్దింకలను బయటకు ఊడ్చేటప్పుడు ఈమెకు ఈ వింత ఆలోచన వచ్చిందంట. సాధారణంగా కళకారులు విభిన్నమైన ఆలోచనలు చేస్తుంటారు. అసాధారణమైన రీతిలో తమ భావాలను వ్యక్తపరుస్తుంటారు. బ్రెండా డెల్గాడో కూడా అదే తరహాలో ఆలోచించి ఈ పద్ధతిలో తన కళను ప్రదర్శిస్తున్నారు. మోనాలిసా, విన్సెంట్ వాన్ గోహ్ వంటి చిత్రాలను బొద్దింకలపై చిత్రించింది. ఆయిల్ పెయింట్ను ఉపయోగించి వేస్తున్న ఈమె పెయింటింగ్స్కు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఈ సృజనాత్మకమైన ఆలోచనతో ప్రతిభను వెలికి తీయడానికి భయపడొద్దని, అసాధ్యమని భావించే పనులు చేయడానికి సిద్ధపడండి అంటూ బ్రెండా డెల్గాడో ఓ మెసెజ్ కూడా ఇస్తుంది.
from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/3f7pcBy
0 Comments