దేశాన్ని కుదిపేస్తున్న పెగాసస్ వ్యవహారం, సుప్రీంకోర్టులో మరో పిటిషన్

దేశంలో మళ్లీ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. న్యూ యార్క్ టైమ్స్‌లో దీనిపై కథనం రావడంతో ఈ విషయం మళ్లీ ఉనికిలోకి వచ్చింది. 2017లోనే ఇజ్రాయెల్ నుంచి పెగసస్ స్పైవేర్‌ను భారత్ కొనుగోలు చేసినట్టు కథనంలో వెల్లడించింది. ఓ రక్షణ ఒప్పందంలో భాగంగా క్షిపణులతో పాటు దీనికి కూడా డీల్ కుదుర్చుకున్నట్టు తెలిపింది. ఈ విషయంపై మళ్లీ దుమారం చెలరేగింది. సుప్రీంకోర్టులో మరోసారి పిటిషన్ దాఖలైంది. భారత్, ఇజ్రాయెల్ మధ్య కుదిరిన ఈ ఒప్పందంపై దర్యాప్తు చేయాలని కోరుతూ పిటిషనర్ ఎంఎల్ శర్మ డిమాండ్ చేశారు. అంతేకాదు ఈ కాంట్రాక్ట్‌లో పాల్గొన్న వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోర్టును కోరారు. అయితే ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టు కమిటీ దర్యాప్తు చేస్తోందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గతంలో కూడా భారత ప్రభుత్వం స్పైవేర్‌ని కలిగి ఉందా..? పార్లమెంటేరియన్లు, జర్నలిస్టులు, కార్యకర్తలు ఇతర సిబ్బందిపై దీని ద్వారా నిఘా పెట్టారా..? అనే దానిపై దర్యాప్తు కోరుతూ పిటిషన్ దాఖలైంది. న్యూయార్క్ టైమ్స్‌లోని కథనం ఆధారంగా బీజేపీపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఇది దేశద్రోహంగా అభివర్ణించింది. వరుసగా కాంగ్రెస్ నేతలు దీనిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది ముమ్మాటికి మోదీ ప్రభుత్వం దేశ ద్రోహమేనని రాహుల్ గాంధీ ట్వీట్ చేయగా, మోదీ ప్రభుత్వం దేశానికి శత్రువులా ఎందుకు ప్రవర్తిస్తోందని రాజ్య సభ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక దీనిపై మరో నేత చిదంబరం వ్యంగ్యంగా స్పందించారు. పెగాసస్ స్పైవేర్ అధునాతన వెర్షన్ ఏదైనా ఉందా అని ఇజ్రాయెల్‌ను అడగాలని చిదంబరం కోరారు. 2024 సాధారణ ఎన్నికలకు ముందు దేశం మరింత అధునాతన సాఫ్ట్‌వేర్‌తో మెరుగ్గా పని చేయగలదని, ఇజ్రాయెల్ కంపెనీకి 4 బిలియన్ డాలర్లు చెల్లించవచ్చని అన్నారు. కాగా స్పైవేర్‌ను ప్రతిపక్షాలు, జర్నలిస్టులపై నిఘా పెట్టడానికి ఉపయోగించారని, బీజేపీ దేశాన్ని బిగ్ బాస్ షోగా మార్చారని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది విమర్శించారు.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/feOHipNg6

Post a Comment

0 Comments