భార్యకు అబద్దం చెప్పి ప్రియురాలితో పుణేకు.. వ్యాపారి గుట్టురట్టు చేసిన జీపీఎస్‌!

ప్రియురాలితో గడపడానికి హోటల్‌లో దిగిన ఓ వ్యాపారి.. తన భార్య ఆధార్ కార్డును ఉపయోగించి అడ్డంగా దొరికిపోయాడు. భార్య ఫిర్యాదుతో అతడ్ని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. గుజరాత్‌కు చెందిన వ్యాపారి తన ప్రియురాలితో కలిసి మహారాష్ట్రలోని పుణేకు వచ్చి ఓ హోటల్‌లో గది తీసుకోడానికి గుర్తింపు కోసం భార్య ఆధార్ కార్డును వినియోగించాడు. భార్య ఫిర్యాదుతో అతడిపై పుణేలోని హింజెవాడీ పోలీసులు కేసు నమోదుచేశారని పోలీస్ అధికారి శుక్రవారం వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. గుజరాత్‌కి చెందిన వ్యాపారి, అతడి భార్య ఓ కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్నారు. తన భర్త కారులో అమర్చిన జీపీఎస్‌ ఆధారంగా అతడు తనను మోసం చేస్తున్నాడని గుర్తించి ఫిర్యాదు చేసినట్లు సదరు మహిళ తెలిపారని చెప్పారు. ‘‘మహిళ తన భర్త వాడుతున్న ఎస్‌యూవీ వాహనంలో జీపీఎస్ ట్రాకర్‌ను అమర్చింది.. గత ఏడాది నవంబర్‌లో అతడు బెంగళూరుకు బిజినెస్ ట్రిప్‌కి వెళ్తున్నట్టు భార్యకు చెప్పాడు.. ఆమె జీపీఎస్ లొకేషన్ తనిఖీ చేసినప్పుడు కారు పుణేలో ఉన్నట్లు గుర్తించింది’’ అని తెలిపారు. దీంతో అతడు బసచేసిన హోటల్‌ను సంప్రదించగా.. వ్యాపారి తన భార్యతో కలిసి వచ్చినట్టు అక్కడ సిబ్బంది చెప్పారని ఫిర్యాదులో పేర్కొంది. సీసీటీవీ ఫుటేజ్‌‌లను పరిశీలించగా.. తన ఆధార్ కార్డును ఉపయోగించి మరో మహిళతో కలిసి హోటల్‌లో దిగినట్టు గుర్తించానని తెలిపింది. మహిళ ఫిర్యాదు ఆధారంగా ఆమె భర్త, ప్రియురాలిపై హింజెవాడీ పోలీసులు నాలుగు రోజుల కిందట కేసు నమోదుచేశారు. ఇద్దరిపైనా ఐపీసీ సెక్షన్ 419 కింద చీటింగ్ కేసు నమోదయ్యిందని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/gdtm5W1

Post a Comment

0 Comments