Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Friday, 26 February 2021

టీకా పంపిణీలో భారత్ కృషి అమోఘం.. మరోసారి డబ్ల్యూహెచ్ఓ ప్రశంసలు

కరోనా వ్యాక్సినేషన్‌లో భారత్ అనుసరిస్తోన్న విధానాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రశంసల జల్లు కురిపించింది. టీకా పంపిణీ విషయంలో భారత్ సమానత్వం కోసం కృషిచేస్తోందని డైరెక్టర్ జనరల్ ప్రశంసించారు. ప్రపంచ దేశాలకు టీకా అందివ్వడంలో ప్రధాని నరేంద్ర మోదీ అందిస్తోన్న సహకారాన్ని టెడ్రోస్ కొనియాడారు. ఈ మేరకు ఆయన ట్విటర్ వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు. ‘టీకా సమానత్వం కోసం మద్దతిస్తోన్న భారత్‌, ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు.. కొవాక్స్‌ పట్ల నిబద్ధత చాటుతున్నారు.. మీరు అందించిన సహకారంతో 60కి పైగా దేశాలు తమ ఆరోగ్య సిబ్బంది, ప్రాధాన్యతా వర్గాలకు వ్యాక్సిన్ అందజేస్తున్నాయి. ఇతర దేశాలు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటాయని ఆశిస్తున్నాను’ అంటూ టెడ్రోస్ ప్రశంసల జల్లు కురిపించారు. కరోనా వైరస్‌ మహమ్మారిపై పోరాటంలో భారత్ చేస్తోన్న కృషిని ఆయన గతంలో పలుసార్లు ప్రశంసించారు. దేశంలో కొవాగ్జిన్, కొవిషీల్డ్‌ టీకాలు అత్యవసర వినియోగ కింద కేంద్రం అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. జనవరి 16న తొలి దశ వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా.. ఫ్రంట్‌లైన్ వర్కర్లకు అందిస్తున్నారు. మార్చి ఒకటి నుంచి రెండో దశ టీకా కార్యక్రమం ప్రారంభం కానుంది. అలాగే ‘వ్యాక్సిన్‌ మైత్రి’ పేరిట పొరుగు దేశాలతో సహా ప్రపంచ దేశాలకు మనదేశం కరోనా టీకాలను పంపిణీ చేస్తోంది. ఆఫ్రికా దేశాలకు తొలి దశ టీకా పంపిణీ బుధవారం ప్రారంభించింది. మొత్తం ఆరు లక్షల డోస్‌లను ఘనాకు పంపింది. కొవాక్స్‌లో భాగంగా పేద దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేస్తోంది. ఫిబ్రవరి 12 వరకు వివిధ దేశాలకు మొత్తం 229 లక్షల డోస్‌ల టీకాలను అందజేసినట్టు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇందులో 64 లక్షలు ఉచితంగా, మిగతా 165 లక్షల డోస్‌లు వాణిజ్యంలో భాగంగా అందజేశారు. బంగ్లాదేశ్‌కు 20 లక్షలు, మాయన్మార్‌కు 17 లక్షలు, నేపాల్‌కు 10 లక్షలు, భూటాన్‌‌కు 1.5 లక్షలు, మాల్దీవులకు లక్ష, మారిషస్‌కు లక్ష, షీషెల్స్‌కు 50వేలు, శ్రీలంక ఐదు లక్షలు, బహ్రెయిన్ లక్ష, ఒమన్ లక్ష, అఫ్గనిస్థాన్‌కు ఐదు లక్షలు, బార్బడోస్‌కు లక్ష, డొమినికాకు 70 వేల డోస్‌లు అందజేసినట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి శ్రీవాస్తవ తెలిపారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3swvO1g

No comments:

Post a Comment