చైనాకు చెందిన మరో 54 యాప్‌లపై నిషేధం.. కొరడా ఝళిపించిన భారత్!

సరిహద్దుల్లో భారత్, చైనాల మధ్య దాదాపు రెండేళ్లుగా ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మరోసారి చైనా యాప్‌లపై కొరడా ఝళిపించేందుకు భారత్‌ సిద్ధమవుతోందని సమాచారం. దేశ భద్రత దృష్ట్యా చైనాకు చెందిన మరో 54 యాప్‌లపై నిషేధించాలని కేంద్రం యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. బ్యూటీ కెమెరా - సెల్ఫీ కెమెరా, ఈక్విలైజర్ అండ్ బాస్ బూస్టర్, యాషెస్ ఆఫ్ టైమ్ లైట్, ఆన్‌మైఓసీ చెస్, అరెనా, స్వీట్ సెల్ఫీ హెచ్‌డీ, వివా వీడియో ఎడిటర్‌, టెన్సెంట్‌ రివర్‌, యాప్‌లాక్‌, డ్యుయల్‌ స్పేస్‌ లైట్‌ వంటి 54 యాప్‌లపై త్వరలోనే నిషేధం విధించనున్నట్లు తెలుస్తోంది. ఈ యాప్‌లతో దేశ భద్రతకు ముప్పు పొంచి ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 2020 ఏప్రిల్‌లో భారత్‌ భూభాగంలోకి చైనా సైన్యం అక్రమంగా చొరబడటంతో ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే 2020 జూన్‌ 15న గల్వాన్‌ లోయ వద్ద భారత్, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికుల మధ్య ఘర్షణలకు దారితీయగా.. రెండు దేశాల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. ఈ క్రమంలోనే చైనా కంపెనీలకు భారత ప్రభుత్వం గట్టి షాకిచ్చింది. దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లుతుందనే కారణాలతో 2020లో వందల సంఖ్యలో చైనా యాప్స్‌లను భారత ప్రభుత్వం నిషేధించింది. జూన్ 2020 నుంచి ఇప్పటి వరకూ 224 చైనా యాప్‌లను భారత్ నిషేధించింది. 2020 జులై నెలలో టిక్‌టాక్ సహా 59 , అదే ఏడాది సెప్టెంబరులో మరో 118 యాప్‌లు, నవంబరులో 43 చైనా యాప్‌లపై కొరడా ఝళిపించింది. వీటిలో టిక్‌టాక్‌తో పాటు విచాట్‌, షేర్‌ఇట్‌, హలో, లైకీ, యూసీ బ్రౌజర్‌, పబ్‌జీ వంటి యాప్‌లున్నాయి. అయితే, అప్పట్లో ఈ వ్యవహారంపై డ్రాగన్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అయినప్పటికీ వాటిని పునరుద్ధరించే యోచన తమకు లేదని భారత్‌ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. కేంద్ర ఐటీ, సమాచార మంత్రిత్వ శాఖ వర్గాల ప్రకారం.. ‘‘54 యాప్‌ల జాబితాలో ఇంతకుముందు కూడా నిషేధించిన వాటిలో కొన్ని ఉన్నాయి.. అయితే వాటినే రీబ్రాండ్ చేసి కొత్త పేర్లతో తిరిగి ప్రారంభించాయి.. ఈ దేశానికి సంబంధించిన మూలలతోనే స్థాపించినట్టు అధికారికంగా ధ్రువీకరించిన తర్వాత యాప్‌లను నిషేధించాలని మరోసారి ఆదేశాలు జారీ అయ్యాయి.. ఈ యాప్‌లలో చాలా వరకు హానికరమైన సాఫ్ట్‌వేర్‌ను అమలు చేయడం లేదా వినియోగదారు సమ్మతి లేకుండా నేరుగా చైనా ఆధారిత డేటా సెంటర్‌లకు సమాచారాన్ని పంపడం వంటివి ఉన్నాయి’’ అని తెలిపాయి.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/q6CpcOJ

Post a Comment

0 Comments