ఎర్రచందనం స్మగ్లర్లకు 11 ఏళ్ల జైలు, రూ.6లక్షల ఫైన్.. సంచలన తీర్పు

ఎర్రచందంన స్మగ్లింగ్ కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. దుంగలను అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన తమిళనాడుకు చెందిన స్మగ్లర్లకు 11ఏళ్ల జైలుశిక్ష, రూ.6లక్షల జరిమానా విధిస్తూ తిరుపతి ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి బుధవారం తుదితీర్పు వెలువరించారు. 2016, ఆగస్టు 11న ఎస్వీఎన్‌పీ రేంజ్ పరిధి కరకంబాడీ రిజర్వ్ ఫారెస్ట్‌లోని ముగ్గురాళ్లతిప్ప వద్ద తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు జి.పొన్నుస్వామి, తిరుమలై, సి.కుమార్‌ను ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం(టాస్క్‌ఫోర్స్‌) అరెస్ట్ చేసింది. వీరి నుంచి వందల సంఖ్యలో ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పక్కా ఆధారాలతో కోర్టులో హాజరు పరిచిన పోలీసులు శిక్ష పడేలా చేశారు. రిజర్వ్ ఫారెస్ట్‌లోకి అక్రమం చొరబడినందుకు ఒక్కొక్కరికి ఐదేళ్ల జైలుశిక్ష, రూ.3లక్షల జరిమానా, అక్రమంగా ఎర్రచందనం దుంగలు తరలించే ప్రయత్నం చేసినందుకు మరో ఐదేళ్ల జైలుశిక్ష, రూ.3లక్షల జరిమానాతో పాటు అటవీ సంపదను దోచుకునేందుకు ప్రయత్నించినందుకు మరో ఏడాది జైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఎర్రచందనం అక్రమ రవాణా కేసుల్లో నిందితులకు ఇంతటి స్థాయిలో శిక్ష పడటం చరిత్రలో ఇదే తొలిసారని పోలీసులు, ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. ఇలాంటి తీర్పులతో స్మగ్లర్ల గుండెల్లో రైళ్లు పరుగులు పెట్టడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/31tm2Q2

Post a Comment

0 Comments