ఎంపీ సీటు త్యాగం.. దత్తన్న దక్కిన గవర్నర్ పదవి!

కేంద్ర ప్రభుత్వం ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను ఆదివారం నియమించింది. తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్, కేరళ, హిమాచల్‌ప్రదేశ్‌లకు కొత్త గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం తెలంగాణ, మహారాష్ట్ర గవర్నర్లు ఈఎస్ఎల్ నరసింహన్, సీహెచ్ విద్యాసాగరరావులను తప్పించిన కేంద్రం, ఈ ఇద్దరికీ ఎక్కడా పోస్టింగ్‌లు ఇవ్వలేదు. అలాగే, తెలంగాణకు చెందిన సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ గవర్నర్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న కలరాజ్ మిశ్రాను రాజస్థాన్‌కు బదిలీ చేశారు. మహారాష్ట్ర గవర్నర్‌గా విద్యాసాగర్‌రావు స్థానంలో భగత్‌సింగ్ కొష్యారీ, కేరళ గవర్నర్‌గా అరిఫ్ మహ్మద్ ఖాన్‌ను నియమించారు. అలాగే, తెలంగాణ గవర్నర్ నరసింహన్‌ను తప్పించి, ఆయన స్థానంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు తమిళసాయి సౌందరరాజన్‌ను కేంద్రం నియమించింది. ఇక, బీజేపీ సీనియర్ నేత అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో రైల్వే మంత్రిగా, మోదీ ప్రభుత్వంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. నాలుగసార్లు సికింద్రాబాద్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 1980లో బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా, 89లో బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, 96 నుంచి 98 వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. తొలిసారి 1991లో సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి విజయం సాధించారు. 1998, 99, 2014 ఎన్నికల్లో ఈ స్థానం నుంచే గెలిచి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. తొలుత ఇక్కడ నుంచి పోటీచేయాలని దత్తాత్రేయ భావించినా అధిష్ఠానం ఆయనకు నచ్చజెప్పింది. ఆయన స్థానంలో కిషన్ రెడ్డికి అవకాశం ఇచ్చింది. ఎంపీ సీటు త్యాగం చేయడంతో గవర్నర్ పదవితో ఆయనను బీజేపీ సంతృప్తి పరిచింది. ఈ ఏడాది మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికల నేపథ్యంలో కొత్త గవర్నర్‌గా ఆర్ఎస్ఎస్ నేత భగత్‌సింగ్ కొష్వారీ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉత్తరాఖండ్‌కు చెందిన ఆయన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా, ఆ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. అలాగే ఉత్తరాఖండ్ సీఎంగా, ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు. కాగా, జులైలోనే నాలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను కేంద్రం నియమించిన విషయం తెలిసిందే. అలాగే, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక గవర్నర్‌ను నియమించారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీ, తెలంగాణకు ఉమ్మడి గవర్నర్‌గా నరసింహన్‌ కొనసాగారు. ఐదేళ్ల తర్వాత ఇరు రాష్ట్రాలకు వేర్వేరుగా నియమించిన కేంద్రం, ఒడిశా బీజేపీ నేత బిశ్వభూషణ్ హరిచందన్‌ను ఏపీ గవర్నర్‌గా జులై 24న బాధ్యతలు చేపట్టారు. పశ్చిమ బెంగాల్‌లో పాగా వేయాలన్న సంకల్పంతో ఉన్న కమలనాథులు.. గవర్నర్‌గా మాజీ ఎంపీ, ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది జగ్దీప్ ధంకర్ నియమించారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2NJ5XBP

Post a Comment

0 Comments