కశ్మీర్‌కు సంబంధించి రాజ్యసభలో సోమవారం కీలక బిల్లు.. సర్వత్రా ఉత్కంఠ

మ్ము కశ్మీర్‌లో ఉత్కంఠ కొనసాగుతోంది. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం భద్రతా బలగాలను భారీగా మోహరిస్తుండటంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ఆదివారం (ఆగస్టు 4) కీలక ప్రాంతాల్లో మరిన్ని ప్లాటూన్ల బలగాలను మోహరించారు. సెక్రటేరియట్, ప్రభుత్వ కార్యాలయాలు, పబ్లిక్ ప్రదేశాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. పలు చోట్ల బారీకేడ్లు ఏర్పాటు చేసి ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేయడానికే తాజా చర్యలు చేపట్టినట్లు బీజేపీ సర్కార్ చెబుతుండగా.. కశ్మీర్ నేతలు మాత్రం అసలు కారణాలు వేరే ఉన్నాయని ఆరోపిస్తున్నారు. మరోవైపు పార్లమెంటులో సోమవారం జమ్ము కశ్మీర్‌కు సంబంధించి కీలక బిల్లును ప్రవేశపెట్టనున్నారు. జమ్ము కశ్మీర్‌లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ల కల్పనకు ఉద్దేశించిన జమ్ము కశ్మీర్‌ రిజర్వేషన్‌ (రెండో సవరణ) బిల్లు-2019ను హోం మంత్రి అమిత్ షా సోమవారం ఉదయం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ముందుగా నిర్ణయించిన దానికంటే రెండు రోజులు ముందుగానే ఈ బిల్లును ప్రవేశపెడుతున్నట్లు తెలుస్తోంది. కేంద్ర కేబినెట్ గత బుధవారమే ఈ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కశ్మీర్‌లో వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ల కల్పనకు ఉద్దేశించిన రిజర్వేషన్‌ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో.. హోంమంత్రి అమిత్‌ షా అధ్యక్షతన ఢిల్లీలో ఆదివారం కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, ఇంటెలిజెన్స్‌ బ్యూరో చీఫ్‌ అర్వింద్‌ కుమార్‌, రా (రీసెర్చ్ అండ్ అనాలిసిస్) అధిపతి సమంత్‌ గోయల్‌, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్‌ గౌబా తదితరులు పాల్గొన్నారు. కశ్మీర్‌లో తాజా పరిస్థితుల నేపథ్యంలో జరిగిన ఈ అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం చర్చనీయాంశంగా మారింది. ప్రయాణికులతో కిక్కిరిసిన రైళ్లు కశ్మీర్ నుంచి అమర్‌నాథ్ యాత్రికులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు తమ తమ ప్రాంతాలకు తిరుగు పయనమయ్యారు. దీంతో జమ్మూలో రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. కశ్మీర్‌లో ఉగ్రవాదులు పెద్ద ఎత్తున హింస సృష్టించే ప్రమాదం ఉందని పేర్కొంటూ.. అమర్‌నాథ్ యాత్రికులను వెనక్కి వెళ్లాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం సూచించిన సంగతి తెలిసిందే. అనంతరం అక్కడ పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. కశ్మీర్‌లో పరిస్థితిపై స్థానిక నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫరూక్ అబ్దుల్లా నివాసంలో నేతలంతా సమావేశమై తాజా పరిస్థితిపై చర్చించారు. కశ్మీర్ విషయంలో తామందరం ఏకధాటిగా ఉన్నామని స్పష్టం చేశారు. కేంద్రం మంత్రి వర్గం సోమవారం మరోసారి భేటీ కానుంది. ఆదివారం సాయంత్రం బీజేపీ ప్రధాన కార్యదర్శులు సమావేశం జరిగింది. వాస్తవానికి కేంద్ర మంత్రి వర్గం బుధవారం సమావేశం కావాల్సి ఉన్నా.. రెండు రోజుల ముందుగానే సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో ప్రధానంగా జమ్మూకశ్మీర్‌ అంశంపైనే చర్చిస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామల నేపథ్యంలో అటు పాకిస్థాన్‌ కూడా అప్రమత్తమైంది. ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆదేశాల మేరకు ఆ దేశ భద్రతా కమిటీ అత్యవసరంగా సమావేశమైంది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/31kd4Ei

Post a Comment

0 Comments