Vijayasai Reddy దమ్ముంటే వీటిపై ట్వీట్ చేయ్.. దేవినేని ఉమ ఛాలెంజ్

వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి, టీడీపీ నేత మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పోలవరం విషయమై చర్చిద్దామంటే ప్రభుత్వ పారిపోయిందని ఉమా ఎద్దేవా చేయగా.. రివర్స్ టెండరింగ్ అంటే వణుకు పుడుతుందా ఉమా? అని విజయసాయి ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన దేవినేని ఉమా.. విజయసాయి రెడ్డీ ఇప్పుడు ట్వీట్ చేయవయ్యా అంటూ ఎదురు దాడి మొదలు పెట్టారు. ‘‘ఇంటర్ పోల్ నిందితులు మీరు, మీ సహచరుడిని అరెస్టు చేస్తే..‌ విడిపించడానికి ప్రధాని చుట్టూ తిరుగుతున్నారు. దమ్ముంటే వీటిపై ట్వీట్ చెయ్. కేసుల నుంచి బయట పడేందుకు ప్రధాని కాళ్లపై పడింది మీరు. అవినీతిపరులు.. నీతి సూత్రాలు వల్లిస్తున్నారు’’ అంటూ ధ్వజమెత్తారు. ‘‘సెర్బియా పోలీసులు ఎందుకు అరెస్టు చేశారు? 22 మంది ఎంపీలు మోదీని కలిసి ఏమి అడుక్కున్నారో ట్వీట్ చెయ్యి. నీలాగా 16 నెలలు జైలుకెళ్ల లేదు, డబ్బు దోచుకోలేదు, క్విడ్ ప్రోకోకు పాల్పడలేదు. నువ్వా నన్ను బెదిరించేది? నీలాగా నేను అక్రమాలకు పాల్పడలేదు. చంద్రబాబు పడిన కష్టానికి నిదర్శనం పోలవరం ప్రాజెక్టు. పనులను రెండు నెలల నుంచి నిలిపేసిన పాపం మీది. ఇటీవల ఒక సీఎం, కొంతమంది ఎంపీలు ప్రధాని కాళ్ల పై పడ్డారు.. వారెవరో ట్వీట్ చేయాలని విజయసాయి రెడ్డిని డిమాండ్ చేస్తున్నా’’ అని దేవినేని ఉమ పేర్కొన్నారు. నిమ్మగడ్డ ప్రసాద్‌‌ను సెర్బియా పోలీసులు అదుపులోకి తీసుకుంటే.. ఆయన్ను విడిపించడానికి వైఎస్ఆర్సీపీ ఎంపీలు ప్రధాని మోదీని బతిమాలారు.. అని పరోక్షంగా ఉమా వ్యాఖ్యానించారు. పోలవరం విషయంలో జగన్ అసత్యాలు ప్రచారం చేశారన్న ఉమా.. పునాదులు లేపకపోతే.. స్పిల్ ఛానల్ దాటి నీరు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. చేసిన అసత్య ప్రచారాలకు ఇప్పుడైనా లెంపలు వేసుకోండని ఆయన చురకలు అంటించారు. రూ.11 వేల కోట్లతో తాము పోలవరం పనులను పూర్తి చేశామని.. పారదర్శకంగా పనులు చేపట్టామన్నారు. తాము ఎర్రబస్సు ఎక్కి వచ్చామని, ‌విజయసాయి రెడ్డి లాగా విమానాలు ఎక్కి రాలేదని ఎద్దేవా చేశారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2yua4ZQ

Post a Comment

0 Comments