ఉగ్రవాదుల చొరబాటుకు పాక్ సహకారం.. సరిహద్దుల్లో కాల్పుల ఉల్లంఘన


సరిహద్దుల్లో మరోసారి దాయాది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు ఇండియన్ ఆర్మీ తెలిపింది. గత రెండు రోజులుగా ఉత్తర కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ సైన్యాలు కాల్పులకు పాల్పడినట్టు పేర్కొంది. జూన్ 3న కుప్వారాలోని నౌగమ్ సెక్టార్‌లో సహాకారంతో ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నించగా.. దానిని తిప్పికొట్టామని వెల్లడించింది. ఆదివారం రాత్రి 11.00 నుంచి 12.40 గంటల ప్రాంతంలో ఎల్ఓసీ వెంబడి కుప్వారా, బారాముల్లా జిల్లాల్లోని కేరాన్, రామ్‌పూర్ సెక్టార్‌లలో పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడ్డారు.. వీటిని సైన్యం సమర్ధంగా తిప్పికొట్టింది’ అని రక్షణ శాఖ అధికార ప్రతినిధి కల్నల్ రాజేశ్ కలియా తెలిపారు. రామ్‌పూర్‌లోని ఉరి సెక్టార్‌లోనూ పాక్ రేంజర్లు ఆదివారం నాడు కాల్పులకు తెగబడినట్టు పోలీస్ అధికారులు వెల్లడించారు. కుప్వారాలో పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం లేదని పోలీసులు వివరించారు. ‘జూన్ 3న అర్ధరాత్రి నౌగామ్ సెక్టార్‌లో పాకిస్థాన్ సైన్యం కాల్పులకు తెగబడి ఉగ్రవాదులను కశ్మీర్‌లోకి పంపేందుకు ప్రయత్నించింది.. ఈ సమయంలో సైన్యం అడ్డుకోవడంతో ఉగ్రవాదులు వెనక్కు వెళ్లిపోయారు’ అని ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు, జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల కోసం సైన్యం వేట ముమ్మరంగా సాగుతోంది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 24 గంటల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లలో తొమ్మిది మంది ముష్కరులను సైన్యం హతమార్చింది. షోపియాన్‌ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆదివారం మధ్యాహ్నం ఐదుగురు, సోమవారం తెల్లవారుజామున నలుగురు ఉగ్రవాదులు హతమైనట్టు అధికారులు తెలిపారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2zhibNs

Post a Comment

0 Comments