జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత చర్యలు మరింత ముమ్మరంగా కొనసాగుతున్నాయి. తాజాగా, షోపియాన్ జిల్లాలో మరో ముగ్గురు ఉగ్రవాదులను భద్రత బలగాలు మట్టుబెట్టాయి. మంగళవారం ఉదయం శ్రీనగర్కు 60 కిలోమీటర్ల దూరంలోని తుర్కవాంగమ్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఎదురుకాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులు హతమైనట్టు జమ్మూ కశ్మీర్ పోలీసులు వెల్లడించారు. 44 రాష్ట్రీయ రైఫిల్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ 178 బెటాలియన్, జమ్మూ కశ్మీర్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. తుర్కవాంగమ్ ప్రాంతంలో ఉగ్రవాదులున్నట్టు నిఘా వర్గాలు సమాచారం అందజేయడంతో మంగళవారం తెల్లవారుజామున భద్రతా బలగాలు అక్కడకు చేరుకుని నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. ఈ సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో సైన్యం అప్రమత్తమయ్యి ఎదురు కాల్పులు ప్రారంభించింది. సైన్యం కాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులు హతమైనట్టు పోలీసులు వెల్లడించారు. కాల్పుల్లో హతమైన ఉగ్రవాదులను జబేర్ అహ్మద్, కమ్రాన్ జహూర్, మునాబ్ ఉల్ ఇస్లామ్గా గుర్తించారు. ఘటనా స్థలిలో రెండు ఏకే 47 రైఫిల్స్, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని, పూర్తి వివరాలు తర్వాత వెల్లడిస్తామని తెలిపారు. వారం రోజుల వ్యవధిలో షోపియాన్లో ఇది నాలుగో ఎన్కౌంటర్. జూన్ 8న 24 గంటల వ్యవధిలో రెండు చోట్ల జరిగిన ఎన్కౌంటర్లలో 9 మంది, జూన్ 10న జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఎన్కౌంటర్లలో మొత్తం 17 మంది ఇప్పటి వరకూ హతమయ్యారు. గడచిన రెండు వారాల్లో ఆరుగురు మోస్ట్వాంటెడ్ కమాండోలు సహా కనీసం 27 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3fpvQBt
0 Comments