కరోనా చిచ్చు: శ్రీలంక జైల్లో ఘర్షణ.. ఆరుగురు ఖైదీల మృతి

రోనా మహమ్మారి జైల్లో చిచ్చు పెట్టింది. వైరస్ భయం అనంతరం చెలరేగిన ఘర్షణలో ఆరుగురు ఖైదీలు మరణించారు. ఇద్దరు జైలర్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో మరో 35 మంది ఖైదీలు గాయపడ్డట్లు లంక అధికారులు తెలిపారు. ఖైదీలు సృష్టించిన విధ్వంసంతో జైలు పరిసరాలు అట్టుడికినట్లు లంక పోలీసు అధికారులు తెలిపారు. శ్రీలంకలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. జైళ్లలోనూ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో పలు జైళ్లలో ఖైదీలు తమ ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు చాలా జైళ్లలో పరిమితికి మించి ఖైదీలు ఉన్నారు. దీంతో పెద్ద సంఖ్యలో వైరస్‌ బారిన పడుతున్నారు. జైళ్లలో సదుపాయాలు సరిగా లేవని, తాము కరోనా వైరస్ బారినపడే ప్రమాదం ఉందని పలు జైళ్లలో ఖైదీలు నిరసనకు దిగుతున్నారు. శ్రీలంక రాజధాని కొలంబో శివార్లలో ఉన్న మహారా జైలులోనూ ఖైదీలు కొన్ని రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. అధికారులు దిగిరాకపోవడంతో ఆదివారం (నవంబర్ 29) జైల్లో అల్లర్లు సృష్టించారు. దీంతో జైలు అధికారులు, ఖైదీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. జైలర్లను బంధించి పలువురు ఖైదీలు పారిపోయే ప్రయత్నం చేశారని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో వారిని అదుపుచేయడానికి ఫైరింగ్ ఓపెన్ చేసినట్లు వెల్లడించారు. ఈ కాల్పుల్లో ఆరుగురు ఖైదీలు మృత్యువాతపడినట్లు తెలుస్తోంది. గాయపడ్డ వారిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ‘జైలు అధికారులను బంధించి తలుపులను తెరుచుకొని ఖైదీలు పారిపోయేందుకు ప్రయత్నించారు. వంటశాలకు, రికార్డ్‌ రూమ్‌కు నిప్పు పెట్టారు. బలవంతంగా తలుపులు తెరుస్తున్న ఖైదీలను జైలు సిబ్బంది అడ్డుకున్నారు. పరిస్థితి అదుపు తప్పడంతో ఫైరింగ్ ఓపెన్ చేశారు’ అని పోలీసు అధికారి అజిత్‌ రొహాన తెలిపారు. అల్లర్లు చెలరేగిన మహారా జైలులో 175 మంది వైరస్‌ బారిన పడినట్లు అజిత్‌ రొహానా తెలిపారు. శ్రీలంక జైళ్లలో 10,000 మందికి మాత్రమే పరిమితి ఉండగా.. ప్రస్తుతం 26 వేల మంది ఖైదీలు ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ప్రతి ఒక్క జైలు ఖైదీలతో కిక్కిరిసిపోయినట్లు తెలుస్తోంది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/39r8HyP

Post a Comment

0 Comments