లవ్ జిహాద్ కేసు.. కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు

మేజర్ తనకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవడం అనేది ప్రాథమిక హక్కని, దీనిని రాజ్యాంగంలో పొందుపరిచారని స్పష్టం చేసింది. ఇటీవలే అలహాబాద్, ఢిల్లీ హైకోర్టులు ఇటువంటి తీర్పులనే వెలువరించిన విషయం తెలిసిందే. ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత అనుబంధానికి సంబంధించిన స్వేచ్ఛను కులం లేదా మతంతో సంబంధం లేకుండా ఎవరైనా జోక్యం చేసుకోలేరని జస్టిస్ ఎస్ సుజాత సచిన్, శంకర్ మగ్దమ్‌‌ల డివిజన్ బెంచ్ తీర్పు వెలువరించింది. ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల రిలేషన్ షిప్ విషయంలో కోర్టు పై విధంగా స్పందించింది. బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ హెచ్‌బీ వాజీద్ ఖాన్ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. ఈ మేరకు తీర్పు చెప్పింది. వాజీద్ ఖాన్, తన సహోద్యోగి రమ్యను ఇద్దరూ వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉండగా దీనిని రమ్య తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నారు. రమ్యను కోర్టు ముందు హాజరుపరచాలని వాజీద్ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. రమ్య ఆమె తల్లిదండ్రులు, వాజీద్, అతడి తల్లిదండ్రులను హాజరుపరచాలని చంద్ర లేఔట్ పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో రమ్య, ఆమె తల్లిదండ్రులు గాంగాధర్, గిరిజ.. వాజీద్ అతడి తల్లి శ్రీలక్ష్మీని హాజరు పరిచారు. ఈ సందర్భంగా ధర్మాసనం ముందు రమ్య తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మహిళా, శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ ఏర్పాటు చేసిన కుటుంబ వివాద పరిష్కార ఫోరమ్ జనదయ సంత్వాన కేంద్రానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తాను విద్యారణ్యపుర మహిళ దక్షత సమితి అనే ఎన్జీఓలో ఉంటున్నట్లు తెలిపారు. వాజీద్‌తో వివాహాన్ని వ్యతిరేకించిన తల్లిదండ్రులు తన స్వేచ్ఛ హక్కును ఉల్లంఘిస్తున్నారని రమ్య ఆరోపించారు. ఇరువురి వివాహానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ రమ్య తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని వాజీద్ తల్లి శ్రీలక్ష్మీ తన అభిప్రాయాన్ని కోర్టుకు విన్నవించారు. అందరి వాదనలను విని రికార్డు చేసిన ధర్మాసనం.. రమ్య మేజర్ అని, తన జీవితంపై నిర్ణయం తీసుకునే సామర్ధ్యం అమెకు ఉందని పేర్కొంది. తక్షణమే మహిళ దక్షత సమితి ఆమెను విడుదల చేయాలని సూచించింది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3lwKPfv

Post a Comment

0 Comments