బీజేపీ చీఫ్ తో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కేంద్ర ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్ మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. హోం మంత్రి అమిత్ షా, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ఒకరికొకరు ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటున్నారు. నడ్డా కాన్వాయ్పై రాళ్ల దాడి ఘటనను విమర్శిస్తూ మమతా బెనర్జీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అదంతా నరేంద్ర బాబు సర్కార్ నాటకం అంటూ కొట్టి పారేశారు. మరోవైపు ఘటనపై కేంద్ర హోం శాఖ.. బెంగాల్ డీజీపీ, చీఫ్ సెక్రటరీకి సమన్లు జారీ చేశారు. డిసెంబర్ 14న హోం శాఖ కార్యదర్శి ముందు హాజరు కావాలని ఆదేశించారు. హోం మంత్రి అమిత్ షా డిసెంబర్ 19, 20 తేదీల్లో కోల్కతాలో పర్యటించాలని నిర్ణయించారు. ఘటనపై బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ తీవ్రంగా స్పందించారు. సీఎం మమతా బెనర్జీ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని సూచించారు. ‘మేడం.. నిప్పుతో చెలగాటం ఆడకండి’ అంటూ ఆయన దీదీకి హెచ్చరికలు చేశారు. బెంగాల్లో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఘటనపై కేంద్ర ప్రభుత్వానికి ఓ నివేదికను పంపించారు. ‘జేపీ నడ్డాకు భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. నడ్డా కాన్వాయ్పై రాళ్లు, ఇటుకలతో దాడి జరిగింది. ఈ ఘటన జరగడం దురదృష్టకరం. ప్రజాస్వామ్యానికి మచ్చ. రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజ్యాంగాన్ని అనుసరించాలి. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయి’ అని గవర్నర్ జగదీప్ వ్యాఖ్యానించారు. అంతకుముందు ఇదొక చిన్న ఘటన అంటూ సీఎం మమతా బెనర్జీ ఆ దాడి ఘటనను కొట్టిపారేశారు. ‘దీని వెనుక ఎవరున్నారో తెలియదు.. కానీ, ఓ టీ దుకాణం వద్ద 50 కార్లతో ఉన్న మీ కాన్వాయ్ ఎవరినైనా ఢీకొట్టవచ్చు లేదా విసిరేయవచ్చు. లేదా ప్లాన్ ప్రకారం చేయవచ్చు. ఇక జరిగింది చాలు.. మీ అబద్దాలను మేం సహించం. ఈ దాడిలో ఏదైనా కుట్ర జరిగి ఉంటే, దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తారు’ అని మమత కౌంటర్ ఇచ్చారు. ‘ఈ నరేంద్ర బాబు సర్కార్ నాటకాన్ని ప్లాన్ చేస్తుంది.. దాన్ని సృష్టిస్తుంది.. తాము సృష్టించిన డ్రామా వీడియోను మీడియాకు పంపుతుంది. వారిని ప్రశ్నించే శక్తి మీడియాకు లేదు. తమ సొంత నాటకాన్ని మీడియాకు పంపుతారు’ అని మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు భద్రత కల్పించాలని స్థానిక ప్రభుత్వాన్ని ఎందుకు కోరలేదని మమతా బెనర్జీ నిలదీశారు. మీవైపు తప్పు పెట్టుకొని తమ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. ‘వారికి (బీజేపీ) వేరే పనే లేదు. కొన్నిసార్లు హోం మంత్రి ఇక్కడకు వచ్చారు. ఇతర సమయాల్లో చద్దా, నడ్డా, ఫడ్డా, భద్దా ఎవరో ఒకరు వస్తారు. వారి సభలకు జనం రానప్పుడు.. తమ పార్టీ కార్యకర్తలను ఉసిగొల్పుతారు’ అంటూ మమతా బెనర్జీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/39ZnsJg
0 Comments