హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. గవర్నర్ దత్తాత్రేయను అడ్డుకుని, ఆయనను నెట్టేసినట్టు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా అసెంబ్లీలో ప్రసంగిస్తుండగా.. కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. గవర్నర్ ప్రసంగానికి వారు పదే పదే అడ్డుతగిలారు. దీంతో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ సభ్యులు.. గవర్నర్ ప్రసంగం ముగిసి సభ నుంచి వెళ్తుండగా ఆయనను అడ్డుకున్నారు. ఈ సమయంలో దత్తాత్రేయను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నెట్టేసినట్టు సమాచారం. అటు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుపై అధికార బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చర్యలకు పాల్పడిన కాంగ్రెస్ సభ్యులను బహిష్కరించాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముఖేశ్ అగ్నిహోత్రి, హర్ష్వర్దన్ చౌహన్, సత్పాల్ రైజాదా, సుందర్ సింగ్ ఠాకూర్, వినయ్ కుమార్లను మార్చి 20 వరకు సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ విపిన్ పర్మార్ ప్రకటించారు. అంతకు ముందు కాంగ్రెస్ సభ్యులు పదే పదే అడ్డుతగలడంతో గవర్నర్ తన ప్రసంగాన్ని క్లుప్తంగా ముగించారు. ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు తమ తమ స్థానాల్లో నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎంతగా వారించినా ప్రతిపక్ష సభ్యులు అడ్డుతగలడంతో ప్రసంగ ప్రతిలోని చివరి లైన్ను గవర్నర్ చదివి ముగించారు. గవర్నర్ ప్రసంగంలో అన్నీ అబద్దాలే ఉన్నాయని కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు. పెరిగిన వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించలేదని దుయ్యబట్టారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన వెంటనే అసెంబ్లీని సోమవారానికి వాయిదా వేశారు. అటు కాంగ్రెస్ సభ్యుల తీరును హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ తీవ్రంగా ఖండించారు. మార్చి 20 వరకు హిమాచల్ ప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు జరగునున్నాయి.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3ssNxGB
No comments:
Post a Comment