Chhattisgarh యువకుడి ఫోన్ నేలకేసి కొట్టిన కలెక్టర్.. కొత్త మొబైల్ కొనిస్తామని సీఎం హామీ!

లాక్‌డౌన్ ఆంక్షలు ఉల్లంఘించాడని ఆరోపిస్తూ రణబీర్ శర్మ ఓ యువకుడిపై ప్రతాపం చూపించిన విషయం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ సమయంలో ఓ యువకుడు మందులు కొనుగోలు చేయడానికి బయటకు రాగా.. అతడిని అడ్డుకున్న కలెక్టర్ యువకుడు ఫోన్ తీసుకొని నేలకేసి కొట్టాడు. అనంతరం యువకుడి చెంప చెల్లుమనిపించాడు. అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న పోలీసులకు ఆదేశించడంతో వారు రెచ్చిపోయి తమ లాఠీలకు పని చెప్పారు. ఈ తతంగాన్ని పక్కనే ఉన్న ఓ వ్యక్తి సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో.. కేంద్ర హోం శాఖ తీవ్రంగా స్పందించింది. ఓ ఐఏఎస్ అధికారి ఇలా వ్యవహరించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారం ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేలా దృష్టికి రావడంతో కలెక్టర్ రణబీర్ శర్మను బాధ్యతల నుంచి తప్పించారు. ఛత్తీస్‌గఢ్‌లో ఇలాంటి చర్యను అస్సలు సహించబోమని ఆయన స్పష్టం చేశారు. యువకుడికి పరిహారంగా కొత్త మొబైల్ ఫోన్ అందజేస్తామని సీఎం భూపేశ్ బఘేలా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘సూరజ్‌పూర్ యువకుడితో కలెక్టర్ అనుచితంగా ప్రవర్తించి అతడి మొబైల్ ఫోన్‌ను ధ్వంసం చేశారు.. ఆయనకు పరిహారంగా కొత్త మొబైల్ అందజేయాలని ముఖ్యమంత్రి సూచించారు’’ అంటూ సీఎంఓ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. కలెక్టర్ చర్యలపై చత్తీస్‌గఢ్ ఐఏఏస్‌ల సంఘం తీవ్రంగా మండిపడింది. ఓ ఉన్నతాధికారి ఇటువంటి ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని, ఆయన వ్యక్తిగత ఆదాయం నుంచి బాధితుడికి మొబైల్ ఇవ్వాలని సూచించింది. ఈ వ్యవహారం పెద్దది కావడంతో కలెక్టర్ రణబీర్ శర్మ ఆ యువకుడికి క్షమాపణలు చెప్పారు. జిల్లాలో కరోనా సమస్య తీవ్రంగా ఉందని.. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన తెలిపారు. ఇది దురదృష్టకర సంఘటనగా ఆయన అభివర్ణించారు. యువకుడి తల్లిదండ్రులతోనూ మాట్లాడారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3vibmCP

Post a Comment

0 Comments