మెహుల్ చోక్సీకి షాక్.. బెయిల్ నిరాకరించిన డొమినికా కోర్టు

వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి బెయిల్‌ను నిరాకరించింది. అంటిగ్వాలో గత సోమవారం అదృశ్యమైన చోక్సి.. అక్రమంగా డొమినికాలోకి ప్రవేశించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. డొమినికా బీచ్‌లో ఆయన ఓ యువతితో కలిసి పట్టుబడినట్టు స్థానిక మీడియా ప్రచారం చేసింది. అయితే, కిడ్నాపర్ల ముఠాలోని యువతే చోక్సీని ట్రాప్ చేసినట్టు ఆయన తరఫున న్యాయవాదులు తెలిపారు. ఇక, న్యాయస్థానం ఎదుట గురువారం వీల్ ఛైర్‌లో హాజరైన చోక్సీ.. తనపై తప్పుడు కేసు బనాయించారని, ఏ నేరాలకు పాల్పడలేదన్నారు. అంతేకాదు, తనను కిడ్నాప్ చేసినట్లు పేర్కొన్నారు. ‘‘డొమినికాలోని వివిధ దేశాలకు చెందిన పౌరులు ఇటువంటి కేసుల్లో బెయిల్‌పై ఉన్నారు.. కాబట్టి మా క్లయింట్‌కు బెయిల్ మంజూరు చేయవచ్చని మేము అభిప్రాయపడ్డాం. అక్రమ ప్రవేశానికి గరిష్టంగా 10,000 డాలర్ల పూచీకత్తు సహా కఠినమైన షరతులను చేర్చండి’’ అని చోక్సీ తరఫున న్యాయవాది వాదించారు. అయితే, చోక్సీ పారిపోయే ప్రమాదం ఉందని, అందుకే బెయిల్ మంజూరు చేయవద్దని డొమినికన్ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ‘‘చోక్సికి డొమినికాలో సంబంధాలు లేవు.. అందువల్ల బెయిల్ మంజూరు చేస్తే ద్వీపం విడిచి పారిపోయే ఉద్దేశం ఉంది.. భారత్‌లోని 11 నేరాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న చోక్సీపై ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీచేసింది’’ అని ప్రభుత్వ న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి చోక్సికీ బెయిల్ నిరాకరించారు. ‘‘ఈ అంశం తీవ్రతను బట్టి బెయిల్ మంజూరు చేయడం లేదు’’ అని న్యాయమూర్తి కాండియా కార్రెట్టే జార్జ్ తీర్పు వెలువరించారు. మే 23న అంటిగ్వా-బార్బడాలో మిస్సయిన .. రెండు రోజుల తర్వాత డొమినికాలో పట్టుబడ్డారు. ఓ అమ్మాయితో ఆయన పరారైనట్టు ప్రచారం జరుగుతోంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నిందితుడిగా ఉన్న చోక్సీ.. 2018 జనవరిలో దేశం విడిచి పారిపోయారు. అంటిగ్వా పౌరసత్వం స్వీకరించిన ఆయన అప్పటి నుంచి అక్కడే ఉన్నారు. చోక్సీని స్వదేశానికి రప్పించే ప్రయత్నాలు చేస్తున్న సీబీఐ.. డొమినికాతో సంప్రదింపులు జరుపుతోంది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3fMTye4

Post a Comment

0 Comments