కశ్మీర్‌లో పేట్రేగిపోయిన ఉగ్రవాదులు.. బీజేపీ నేత దారుణ హత్య

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి ఘాతుకానికి తెగబడ్డారు. పుల్వామా జిల్లాల్లో బీజేపీ నేత, మున్సిపల్ కౌన్సెలర్‌ రాకేశ్ పండిట్‌ను ఉగ్రవాదులు బుధవారం కాల్చి చంపారు. పుల్వామాలోని త్రాల్‌లో రాకేశ్ పండిటా తన స్నేహితుడి ఇంటి వద్ద ఉండగా.. ముగ్గురు ఉగ్రవాదులు ఆయనపై కాల్పులు జరిపినట్టు పోలీస్ వర్గాలు తెలిపాయి. ఘటనా స్థలిలోనే ఆయన మృతిచెందగా.. ఇదే దాడిలో అసిఫా ముస్తాక్ అనే మహిళ గాయపడింది. తీవ్రంగా గాయపడిన ఆమె శ్రీనగర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. పరిస్థితి విషమంగా ఉంది. శ్రీనగర్‌లోని ఓ హోటల్‌లో దిగిన రాకేశ్ పండిట్‌కు వ్యక్తిగత భద్రత కల్పించాం.. కానీ, త్రాల్‌కు ఆయన ఒంటరిగా వెళ్లాడని పోలీసులు పేర్కొన్నారు. బీజేపీ నేత రాకేశ్ పండిటాను ఉగ్రవాదులు కాల్చిచంపినట్టు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. ఆయనకు ఇద్దరు సెక్యూరిటీ గార్డులతో భద్రత కల్పించామని, త్రాల్‌కు వెళ్లేటప్పుడు వారిని తీసుకెళ్లలేదని అన్నారు. ఆ ప్రాంతంలో సోదాలు కొనసాగుతున్నాయని వివరించారు. ఈ ఘటనపై జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘పుల్వామాలోని త్రాల్‌లో కౌన్సెలర్ రాకేశ్ పండిట్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడటం బాధాకరం.. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాం.. ఈ కష్టకాలంలో వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాను.. ఇటువంటి దుర్మార్గపు చర్యలతో ఉగ్రవాదులు ఎప్పటికీ విజయం సాధించలేరు.. ఇటువంటి చర్యలకు బాధితులైన వారిని న్యాయం చేస్తాం’’ అని అన్నారు. మూర్ఖమైన హింసాత్మక చర్యలు జమ్మూ కశ్మీర్‌కు నష్టాన్ని కలిగిస్తున్నాయని మాజీ సీఎం, పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తీ మండిపడ్డారు. ‘‘ఉగ్రవాదులు చేతిలో బీజేపీ నేత రాకేశ్ పండిట్ హత్యకు గురికావడం దిగ్భ్రాంతికరం.. మూర్ఖత్వం, హింసాత్మక చర్యలు జమ్మూ కశ్మీర్‌కు నష్టాన్ని మిగుల్చుతున్నాయి.. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’’ అని ట్వీట్ చేశారు. ఈ దాడిని పీపుల్స్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు సాజిద్ లోనే తీవ్రంగా ఖండిచారు. కశ్మీర్‌లో జరిగిన 2018 స్థానిక సంస్థల ఎన్నికల్లో త్రాల్ నుంచి రాకేశ్ పండిట్ మున్సిపల్ కౌన్సెలర్‌గా ఎన్నికయ్యారు. అయితే, ఈ ఎన్నికలను ప్రధాన పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ బహిష్కరించడంతో ఆయన విజయం సాధించారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/34IUgm0

Post a Comment

0 Comments