దక్షిణ చైనా సముద్రంలో అమెరికా యుద్ద నౌకను తరమికొట్టాం.. డ్రాగన్ ప్రకటన

తమ ప్రాదేశిక జలాల్లోకి అక్రమంగా చొరబడిన అమెరికా యుద్ధ నౌకను తరిమికొట్టామని చైనా ప్రకటించింది. దక్షిణ చైనా సముద్రంలోని పరాసెల్‌ దీవుల వద్దకు అనుమతి లేకుండా యూఎస్‌ఎస్‌ బెన్‌ఫోల్డ్‌ నౌక ప్రవేశించిందని సోమవారం తెలిపింది. ఇది ప్రాంతీయ ఆస్థిరతను దెబ్బతీయడమేనని పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) పేర్కొంది. ఇటువంటి చర్యలను తక్షణమే మానుకోవాలంటూ అమెరికాను చైనా హెచ్చరించింది. చైనా ప్రకటనపై అమెరికా దీటుగానే బదులిచ్చింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారమే పరాసెల్‌ దీవుల వద్ద బెన్‌ఫోల్డ్‌ తన స్వేచ్ఛను వినియోగించుకుందని అమెరికా నేవీ ఒక ప్రకటనలో వివరించింది. ‘‘ సమీపంలోని పలు దేశాలను చైనా ఇబ్బందులకు గురిచేస్తోంది.. తాజా చర్యతో ఈ జలాలు చైనా సొత్తు కాదని చూపించాం.. పరాసెల్‌ దీవులు తమవేనంటూ వాదనలు చేస్తున్న చైనా, అంతర్జాతీయ చట్టాన్ని మీరుతోంది. సముద్రాలపై స్వేచ్ఛాయుత నౌకాయానం అన్ని దేశాల ప్రయోజనాలకు కీలకం’’ అని అమెరికా స్పష్టం చేసింది. ‘దక్షిణ చైనా సముద్ర ప్రాదేశిక జలాలపై చట్టబద్దంగా తమకే హక్కుందని చైనా చెప్పుకుంటోంది. పరాసెల్ దీవుల చుట్టూ ఉన్న బేస్‌లైన్‌లు అంతర్జాతీయ చట్టానికి విరుద్ధంగా ఉన్నాయని అమెరికా నిరూపించింది’ యూఎస్ నేవీ తెలిపింది. తాజా పరిస్థితిపై అమెరికా రక్షణ విభాగానికి చెందిన ఇద్దరు అధికారులు మాట్లాడుతూ... చైనా ప్రతిచర్యల వల్లే ఈ ఆపరేషన్ నిత్యకృత్యంగా మారిందని, పెంటగాన్‌కు ఆందోళన కలిగించే విషయం కాదని వ్యాఖ్యానించారు. పేరు వెల్లడించడానికి నిరాకరించిన ఈ అధికారులు.. నిరంతర ఆపరేషన్‌లో ఓ భాగమేనని తెలిపారు. ఇదిలా ఉండగా, దక్షిణ చైనా సముద్ర జలాలపై చైనాకు ఎటువంటి అధికారం లేదని 2016 జులై 12న అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు చెప్పింది. అయితే, ఈ తీర్పును తాము అంగీకరించబోమని డ్రాగన్ స్పష్టం చేసింది. పరాసెల్ దీవులు తమవంటే తమవేనంటూ చైనా, తైవాన్, వియత్నాం వాదిస్తున్నాయి. ఈ దీవుల గుండా ఏదైనా నౌక వెళ్లాలంటే తమ అనుమతి తప్పనిసరని అంటున్నాయి. వనరులు సమృద్ధిగా ఉన్న ఈ ప్రాంతంలోని వందలాది ద్వీపాల కోసం బ్రూనై, చైనా, మలేషియా, ఫిలిప్పీన్స్ పోటీపడుతున్నాయి. చైనా చాలా ప్రాంతాలలోని వనరులును దోచుకోడానికి ప్రయత్నిస్తోంది. ‘స్కార్‌బరో షోల్‌లో సాంప్రదాయ ఫిలిప్పీన్స్ హక్కులలో చైనా జోక్యం చేసుకుంది.. రీడ్ బ్యాంక్ సమీపంలో చమురు, గ్యాస్ నిక్షేపాల అన్వేషణ ద్వారా ఆ దేశ సార్వభౌమ హక్కులను ఉల్లంఘించింది’అని అంతర్జాతీయ న్యాయస్థానం తన తీర్పులో వ్యాఖ్యానించింది. చైనా చర్యలపై అమెరికా విదేశాంగ మంత్రి అంటోని బ్లింకేన్ తీవ్రంగా మండిపడ్డారు. జలమార్గాల్లో స్వేచ్చగా ప్రయాణం అన్ని దేశాలకు శాశ్వతమైన ఆసక్తికరంగా ఉంటుందని అన్నారు. దక్షిణ చైనా సముద్రం జలమార్గంలో తప్ప మరెక్కడా నిబంధనలకు ముప్పు లేదు అని వ్యాఖ్యానించారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3yPMkwn

Post a Comment

0 Comments