భారత్‌లో ఒమిక్రాన్: ఆ రాష్ట్రంలో 2 కేసులు.. కేంద్రం అధికారిక ప్రకటన!

ప్రపంచాన్ని కలవరపెడుతోన్న ఒమిక్రాన్ వేరియంట్ భారతదేశంలోకి కూడా వచ్చేసింది. ఇప్పటికే పదుల దేశాల్లో నమోదు కాగా.. భారత్‌లో కూడా ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రంలో ఇద్దరికి కరోనా వైరస్ వేరియంట్ ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వెల్లడించింది. దేశంలో రిపోర్ట్ అయిన మొదటి కేసులు ఇవేనని గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ‘దేశంలో ఇప్పటి వరకు రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఈ రెండూ కర్ణాటక రాష్ట్రంలోనే వచ్చాయి. ఒమిక్రాన్ సోకిన వ్యక్తులతో కాంటాక్ట్ అయిన వారిని గుర్తించి, పరీక్షలు నిర్వహిస్తున్నాం’’ అని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ వెల్లడించారు. ఒమిక్రాన్ వేరియంట్‌ను దక్షిణాఫ్రికాలో మొదటగా గుర్తించగా.. ఇప్పటి వరకు 29 దేశాలకు ఈ మహమ్మారి విస్తరించింది. ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడంతో ఈ వేరియంట్ వ్యాప్తి చెందిన 30వ దేశంగా భారత్‌గా గుర్తింపు పొందింది. ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. బుధవారం నుంచే అంతర్జాతయ ప్రయాణికులపై ఆంక్షలను అమలు చేస్తోంది. ఇదిలా ఉంటే, హైదరాబాద్‌లో సైతం ఓ మహిళలో ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు గుర్తించినట్లు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు వెల్లడించారు. ప్రపంచాన్ని చుట్టేస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్ ఇండియాలోకి ప్రవేశించడంతో కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు హై అలర్ట్ ప్రకటించాయి.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/3DeEJt1

Post a Comment

0 Comments