తక్షణమే హింసను నిలిపివేయండి.. ఫోన్ కాల్‌లో పుతిన్‌కు మోదీ సూచన

ఉక్రెయిన్‌పై దాడుల విషయమై రష్యా అధ్యక్షుడికి ఫోన్ చేసిన భారత ప్రధాని నరేంద్ర మోదీ తక్షణమే ఆపాలని సూచించారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో మోదీ గురువారం పుతిన్‌కు ఫోన్‌ చేశారు. ఈ సందర్భంగా నాటో కూటమితో దీర్ఘకాలంగా ఉన్న విభేదాలను పరిష్కరించుకునేందుకు నిజాయతీతో కూడిన మార్గమే ఉత్తమని తెలిపారు. ‘‘తక్షణమే హింసకు స్వస్తి పలకండి. సమస్యపై దౌత్యపరమైన చర్చలకు మార్గం ఏర్పరిచేలా అన్ని వైపుల నుంచి ప్రయత్నాలు సాగించండి’’ అని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కోరారు. ఉక్రెయిన్‌లోని భారతీయుల భద్రత గురించి పుతిన్‌ను ప్రధాని మోదీ అప్రమత్తం చేశారు. మరీ ముఖ్యంగా అక్కడ భారీ సంఖ్యలో ఉన్న విద్యార్థుల భద్రత విషయాన్ని ప్రస్తావించారు. వారిని సురక్షితంగా భారత్‌కు రప్పించడమే తమకు అత్యంత ప్రధానమని మోదీ స్పష్టం చేశారు. ద్వైపాక్షిక ప్రయోజనాలతో ముడిపడిన అంశాలపై... ఉభయ దేశాల అధికారులు, దౌత్య బృందాలు నిరంతరం సంప్రదింపులు కొనసాగించడానికి నేతలిద్దరూ అంగీకరించారు. ఉక్రెయిన్‌ నుంచి భారతీయులను సురక్షితంగా వెనక్కు తీసుకొచ్చేందుకు అవకాశమున్న అన్ని మార్గాల్లోనూ ప్రయత్నిస్తామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో మోదీ అధ్యక్షతన భద్రత వ్యవహారాల కేబినెట్‌ కమిటీ గురువారం అత్యవసర సమావేశం నిర్వహించింది. అక్కడ పరిస్థితులపై మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌ షా, నిర్మలా సీతారామన్‌, జైశంకర్‌, పీయూష్‌ గోయల్‌, హర్దీప్‌సింగ్‌ పురి, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ తదితరులతో ప్రధాని చర్చించారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల భద్రతకూ, వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకూ తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ నొక్కి చెప్పారు.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/SmEFblP

Post a Comment

0 Comments