Ukraine Crisis ఎమర్జెన్సీ ప్రకటించిన ఉక్రెయిన్.. పౌరులంతా యుద్ధంలో పాల్గొనాలని పిలుపు

రష్యా-ఉక్రెయిన్‌ సరిహద్దులో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఏ క్షణమైనా యుద్ధానికి దిగుతుందనే సంకేతాలు కనిపిస్తుండడంతో ఉక్రెయిన్‌ మరింత అప్రమత్తమయింది. భవిష్యత్తులో ఐరోపా భద్రతను ప్రస్తుత పరిణామాలు నిర్ణయిస్తాయని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొడిమిర్‌ జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తాము సమాయత్తమవుతున్నామని తెలిపారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఉక్రెయిన్‌లో ఎమర్జెన్సీ విధింపునకు ఆ దేశ భద్రతా మండలి ఆమోదం తెలిపింది. దీనిని పార్లమెంటు ఆమోదించడంతో నెలరోజులపాటు ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు బుధవారం రాత్రి ప్రకటించింది. ఎమర్జెన్సీ 30 రోజుల అమలులో ఉంటుందని, అవసరమైతే మరో నెల పొడిగిస్తామని తెలిపింది. ఫిబ్రవరి 24 నుంచి 30 రోజులపాటు అత్యవసర పరిస్థితి అమల్లోకి రానుంది. స్వయంప్రతిపత్తి ప్రాంతాలుగా రష్యా ప్రకటించిన డొనెట్స్క్‌, లుహాన్స్క్‌ మినహా ఉక్రెయిన్‌ అంతటా ఎమర్జెన్సీ అమల్లో ఉంటుంది. ఎమర్జెన్సీలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ప్రాంతీయంగా నిర్ణయాలు తీసుకుంటాయని పేర్కొంది. ప్రభుత్వ ఆస్తులకు అదనపు రక్షణ కల్పించడం, వాహనాల కదలికలపై ఆంక్షలు, అదనపు తనిఖీలు వంటివి మాత్రం అన్నిచోట్లా ఉంటాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఎమర్జెన్సీ సమయంలో ర్యాలీలు, ప్రచారాలు, సమావేశాలు, సభలకు అనుమతి లేదని అధికారులు తెలిపారు. మరోవైపు, దేశ ప్రజలంతా యుద్ధానికి సిద్ధం కావాలని, పోరాడే పోరాడే వయస్సు గల పురుషులందరూ తప్పనిసరిగా సైనిక సేవల్లోకి రావాలని స్పష్టం చేసింది. నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులకైనా భయపడేది లేదని జెలెన్‌స్కీ పునరుద్ఘాటించారు. రిజర్వు భద్రత బలగాలను సిద్ధం చేస్తున్నామని ప్రకటించారు. ఉక్రెయిన్ వద్ద దాదాపు 2 లక్షల సైన్యం ఉండగా.. అదనంగా మరో 2.5 లక్షల రిజర్వ్ బలగాలను సిద్ధం చేస్తున్నట్లు జెలెన్‌స్కీ తెలిపారు. అటు, డొనెట్స్క్‌, లుహాన్స్క్‌‌లను స్వయం ప్రతిపత్తి ప్రాంతాలుగా గుర్తిస్తూ తీర్మానానికి ఆమోదం తెలిపిన చట్టసభ సభ్యుల సహా 351 మంది రష్యన్లపై ఆంక్షలకు ఉక్రెయిన్ పార్లమెంట్ బుధవారం ఆమోదం తెలిపింది. ఆంక్షల జాబితాలో ఉన్నవారిని ఉక్రెయిన్‌లోకి ప్రవేశించకుండా నిరోధించడం, స్తులు, మూలధనం, వ్యాపార లైసెన్సుల రద్దు చేయడం వంటి పరిమితులను విధించారు. కాగా, ఉక్రెయిన్‌లోని తమ దౌత్య సిబ్బందిని వెనక్కి రప్పించే ప్రయత్నాలు రష్యా ప్రారంభించింది. కీవ్‌లోని తమ రాయబార కార్యాలయంపై రష్యా జెండాను తొలగించింది. తమ పౌరులెవరూ రష్యా వెళ్లవద్దనీ, ఇప్పటికే అక్కడ ఉన్నవారు వెనక్కి వచ్చేయాలని ఉక్రెయిన్‌ కూడా సూచించింది. రష్యాలోని తమ రాయబారుల్ని ఉక్రెయిన్‌కు రప్పించింది. ఆ దేశంతో ఎలాంటి దౌత్య సంబంధాలు కొనసాగించరాదని నిర్ణయించింది. కలిసి కూర్చొని చర్చించుకుందామని అనేకసార్లు రష్యా అధ్యక్షుడికి తాను సూచించానని అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/BWIAorn

Post a Comment

0 Comments