కశ్మీర్‌ లోయకు 38 వేల అదనపు బలగాలు.. మరో సంచలనం దిశగా మోదీ?

జమ్మూ కశ్మీర్‌కి కేంద్రం భారీగా అదనపు బలగాలను తరలిస్తోంది. పది వేల అదనపు బలగాలను తరలించాలని కేంద్రం జూలై 25న ఆదేశాలు జారీ చేసింది. ఆగష్టు 1న మరో 28 వేల మంది సైనికులు కశ్మీర్‌ లోయకు వెళ్లాలని రక్షణ శాఖ ఆదేశించింది. ఒక్కసారిగా ఇంత భారీ మొత్తంలో సైన్యాన్ని జమ్మూ కశ్మీర్‌కు తరలిస్తుండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. బలగాలను మోహరిస్తుండటం పట్ల కశ్మీర నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదో జరగబోతుందనే ఆందోళన రాష్ట్ర ప్రజల్లో మొదలైందని వారు ఆరోపిస్తున్నారు. కశ్మీర్లో చొరబాట్లు తగ్గాయని, శాంతి భద్రతల పరిస్థితి మెరుగ్గా ఉందని ఇటీవలే కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంట్‌లో ప్రకటించారు. కానీ కేంద్రం మాత్రం భారీ సంఖ్యలో బలగాలను కశ్మీర్లో మోహరిస్తోంది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో 65 సీఆర్పీఎఫ్ బెటాలియన్లు విధులు నిర్వర్తిస్తున్నాయి. అమర్‌నాథ్ యాత్ర కోసం మరో 20 బెటాలియన్ల బలగాలు విధి నిర్వహణలో ఉన్నాయి. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35-ఏ లను రద్దు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. 2014, 2019 బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాలు ఉండటమే దీనికి కారణం. జమ్మూ కశ్మీర్‌ను విభజిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. జమ్మూను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసి.. లడఖ్, కశ్మీర్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారుస్తారనే టాక్ వినిపిస్తోంది. ఆర్టికల్ 35ఎ, ఆర్టికల్ 370లను రద్దు చేస్తారనే ప్రచారాన్ని నమ్మొద్దని గవర్నర్ సత్య పాల్ మాలిక్ స్పష్టం చేశారు. సంచలనాలకు మారు పేరైన మోదీ సర్కారు మరో సంచలన నిర్ణయం తీసుకోబోతుందనేది మరో టాక్. నోట్ల, బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీ మార్పు, రైల్వే బడ్జెట్‌ను కేంద్ర బడ్జెట్లో కలిపేయడం లాంటి నిర్ణయాలను మోదీ తీసుకున్నారు. మరోసారి మోదీ సంప్రదాయాన్ని బ్రేక్ చేస్తారని.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్ర కోట మీది నుంచి కాకుండా కశ్మీర్లో త్రివర్ణ పతాకాన్ని ఎగరేస్తారనే ప్రచారం జరుగుతోంది. 2018 నవంబర్ 22న జమ్మూ కశ్మీర్ అసెంబ్లీని రద్దు చేసి గవర్నర్ పాలన విధించారు. దీంతో కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం బలగాలను తరలిస్తున్నారేమో అనేది మరికొందరి భావన. పశ్చిమ పాకిస్థాన్‌కు చెందిన శరణార్థులకు ఓటు హక్కు కల్పిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఉగ్రవాదుల చొరబాట్లను అడ్డుకోవడానికి రైళ్లు, గగనతల మార్గం ద్వారా బలగాలను తరలిస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలు కశ్మీర్లో భారీ విధ్వంసానికి తెగబడే అవకాశం ఉందనే ఇంటెలిజెన్స్ సమాచారంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. మొత్తానికి కేంద్ర బలగాల తరలింపు వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. మోదీ మదిలో ఏముందనేది మరి కొద్ది రోజుల్లో తేలే అవకాశం ఉంది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2T0Thqy

Post a Comment

0 Comments