అటు కశ్మీర్లో ఉద్రిక్తత.. ఇటు భారత్‌కు ఇజ్రాయెల్ స్నేహగీతం

ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ భారత ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. మన బలమైన స్నేహం, పెరుగుతోన్న భాగస్వామ్యం మరింతగా ఎదగాలని నెతన్యాహూ ఆకాక్షించారు. మోదీ, నెతన్యాహూ కలిసి ఉన్న ఫొటోలను భారత్‌లోని ఇజ్రాయెల్ ఎంబసీ ట్వీట్ చేసింది. ఈ ఫొటోలను వీడియోలుగా కూర్చి.. బాలీవుడ్ ఎవర్ గ్రీన్ హిట్ ‘షోలే’ సినిమాలోని ‘‘యే దోస్తీ హమ్ నహీ తోడెంగే..’’ అనే మ్యూజిక్‌ను బ్యాక్‌గ్రౌండ్లో ప్లే చేశారు. గత నెలలో ఇజ్రాయెల్ ప్రధాని ఎన్నికల ప్రచారంలోనూ మోదీ ఫొటోను వాడారు. టెల్ అవివ్‌లోని ఓ బిల్డింగ్‌ బయట.. మోదీతో నెతన్యాహూ కరచలనం చేస్తున్న ఫొటోను వేలాడదీశారు. నెతన్యాహూ ఇజ్రాయెల్‌కు సుదీర్ఘకాలంగా ప్రధానిగా కొనసాగుతున్నారు. కానీ ఇటీవల సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారు. దీంతో సెప్టెంబర్లో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ఎన్నికలకు 8 రోజుల ముందే ఆయన భారత్‌లో పర్యటించనున్నారు. మే నెలలో వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘన విజయం సాధించాక.. ప్రధాని మోదీని తొలిసారి అభినందించిన దేశాధినేతల్లో నెతన్యాహూ ఒకరు. కశ్మీర్ అంశంపై తేల్చేయాలని కేంద్రం భావిస్తోన్న తరుణంలో భారత్‌ కోసం ఇజ్రాయెల్ ఇలా స్నేహగీతం ఆలపించడం గమనార్హం. ఎలాంటి పరిస్థితులోనైనా భారత్‌కు మద్దతుగా నిలిచేందుకు ఇజ్రాయెల్ సన్నద్ధంగా ఉంది. గత ఫిబ్రవరిలో జరిగిన పుల్వామా దాడిని ఖండించిన ఇజ్రాయెల్.. తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో తాము అన్ని విధాలుగా మద్దతుగా నిలుస్తామని ప్రకటించింది. గతంలో భారత్, ఇజ్రాయెల్ మైత్రిని ‘స్వర్గంలో కుదిరిన పెళ్లి’’గా నెతన్యాహూ అభివర్ణించారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2T3v4QE

Post a Comment

0 Comments