కశ్మీర్ సమస్య పరిష్కారం.. ఇమ్రాన్‌కు పాక్ కుర్రాడి సలహా.. వైరల్

కశ్మీర్ కోసం ఏం చేయడానికైనా వెనుకాడబోమని పాక్ ప్రధాని ప్రకటించిన సంగతి తెలిసిందే. కశ్మీర్ భారత సైన్యం గుప్పిట్లో ఉందని ఆరోపిస్తోన్న ఆయన.. కశ్మీరీలకు సంఘీభావంగా ముందుకు రావాలని తమ దేశ ప్రజలను కోరారు. దీంతో ఆగష్టు 30న చాలా మంది పాక్ ప్రజలు కశ్మీరీలకు సంఘీభావంగా రోడ్లెక్కారు. కశ్మీరీలకు మేం తోడుగా ఉంటామని తొడలు కొట్టారు. కానీ ఓ కుర్రాడు మాత్రం పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు అద్భుతమైన సలహా ఇచ్చాడు. కశ్మీర్ సమస్యను పరిష్కరించాలంటే, భారత్‌కు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు మాట్లాడాలంటే.. ముందుగా ఈ పనులు చేయాలంటూ సలహా ఇచ్చాడు. స్థానిక మీడియాకు ఆ కుర్రాడు ఇచ్చిన ఇంటర్వ్యూ వైరల్‌గా మారింది. ‘‘ప్రపంచంలోని అనేక దేశాలతో భారత్‌కు వాణిజ్య సంబంధాల ఉన్నాయి. దీంతో ఆయా దేశాలతో భారత్ లాబీయింగ్ చేస్తోంది. పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కూడా ఆ స్థాయిలో బలపడి.. భారత్‌ అంత బలంగా మారితేగానీ కశ్మీర్, ఇతర సమస్యల పట్ల అంతర్జాతీయంగా ప్రభావం చూపలేం. భారత్‌ను పాకిస్థాన్ ఆర్థికంగా ఓడించలేనంత వరకు కశ్మీర్ సమస్య పరిష్కారం కాదు’’ అని ఆ కుర్రాడు చెప్పాడు. ‘‘భారత్‌తో సంబంధాలను వదులుకోవడానికి ఏ దేశం కూడా ఇష్టపడటం లేదు. దీంతో పాకిస్థాన్ తరఫున మాట్లాడానికి ఏ దేశమూ ముందుకు రావడం లేదు. కాబట్టి మనం మన ఆర్థిక వ్యవస్థ మీద ఫోకస్ పెడితే బెటర్. మన ఆర్థిక వ్యవస్థ బలోపేతమైతే.. కశ్మీర్, బలూచిస్థాన్ లాంటి సమస్యలు పరిష్కారం అవుతాయ’’ని ఆ కుర్రాడు సలహా ఇచ్చాడు. ఇప్పటికే పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ పాతాళంలోకి వెళ్తోంది. ఆ దేశాన్ని ఆదుకోవడానికి బెయిల్ అవుట్ ప్యాకేజీలు ఇవ్వాల్సి వస్తోంది. మరోవైపు పాక్ ప్రభుత్వమేమో.. మినరల్ వాటర్ బాటిళ్లను అమ్మి.. డబ్బు సంపాదించాలని భావిస్తోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భారత్‌తో ఢీ అంటే ఢీ అనేలా పాక్ ఆర్థిక వ్యవస్థ ఎదగాలంటే.. ఎంత కాలం పడుతుందంటారు..?


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/32q6gFX

Post a Comment

0 Comments