తెలుగు రాష్ట్రాల్లో ఎలాగైనా బలపడాలని భావిస్తోన్న భారతీయ జనతా పార్టీ.. చేరికలను ప్రోత్సహిస్తోంది. హిందూ ముద్రతో దూసుకెళ్తున్న బీజేపీ.. ఏపీలోనూ అదే మంత్రాన్ని జపిస్తోంది. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను ఆ పార్టీ క్షుణ్నంగా పరిశీలిస్తోంది. ఎన్నికల ముందు హిందువుల ఓట్ల కోసం తపించిన జగన్.. ఎన్నికలు ముగిశాక క్రిస్టియన్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఇప్పటికే ప్రచారం మొదలైంది. అమెరికాలో జ్యోతి ప్రజ్వలన చేయడానికి జగన్ నిరాకరించారని బీజేపీ నేతలు ఆరోపించారు. దీంతో జగన్ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఏ సీఎంలకు సాధ్యం కాని రీతిలో హిందువులను మెప్పించేలా జగన్ కొన్ని నిర్ణయాలను తీసుకున్నారు. హిందూయేతర వ్యక్తులు తిరుమల సహా రాష్ట్రంలోని ఏ ఆలయంలోనూ ఉద్యోగాలు పొందకుండా, ఆలయ పరిసరాల్లో షాపులు నిర్వహించకుండా జగన్ సర్కారు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. జగన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రశంసిస్తూ గతంలో ప్రచారక్గా పని చేసిన ఉమేశ్ జీ ఫేస్బుక్లో ఓ పోస్ట్ షేర్ చేశారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం హిందూ దేవాలయాలు, ధార్మిక సంఘాలు అన్యమతాల బారిన పడకుండా కాపాడుతుందన్నారు. ఏపీ సీఎం తీసుకున్న నిర్ణయం మేరకు.. వేరే మతస్తులు విక్రయించే పూలు, అక్షింతలు సహా ఏ పూజా వస్తువులను ఆలయాల్లోకి అనుమతించరు. ఆయన బీజేపీయేతర సీఎం కావడంతో ఈ వార్త సోషల్ మీడియాలో ఎక్కడా కనిపించలేదు. బీజేపీ సీఎం ఎవరైనా ఈ పని చేసి ఉంటే.. ఆయన్ను దేవుడి అవతారంతో పోల్చేవార’’ని ఉమేశ్ జీ వ్యాఖ్యానించారు. జగన్ శంఖారావం పూరిస్తోన్న ఫొటోను తన పోస్టుకు జత చేశారు. కొందరు బీజేపీ నేతలు ఆయనపై ‘మత’ ముద్ర వేయడానికి ప్రయత్నిస్తోన్న తరుణంలో ఆరెస్సెస్ మాజీ ప్రచారక్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2ZtREs4
0 Comments