రైలు, విమాన ప్రయాాణాలకు ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరి కాదు.. కేంద్రం

ప్రయాణాల్లో ఆరోగ్యసేతు యాప్ తప్పనిసరి కాదని, అది లేకుండా కూడా రైళ్లు, విమానాల్లో ప్రయాణించవచ్చని కేంద్ర ప్రభుత్వం కర్ణాటక హైకోర్టుకు తెలిపింది. బెంగళూరుకు చెందిన సైబర్ కార్యకర్త అనివర్ అరవింద్ ఈ యాప్‌కు సంబంధించి పలు సందేహాలను వ్యక్తం చేస్తూ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కేంద్రం ఈ విషయాన్ని తెలిపింది. శుక్రవారం నాటి విచారణ సందర్భంగా కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎంఎన్ నర్గుంద్ వాదనలు వినిపించారు. యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలనేది ప్రభుత్వ సూచన మాత్రమేనని, ప్రయాణికులు ఎవరికి వారే దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని అదనపు సొలిసిటర్ తెలిపారు. ప్రయాణికులు తప్పకుండా ఆరోగ్యసేతు యాప్‌ను కలిగి ఉండాల్సిన అవసరం లేదని, దానికి బదులుగా స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని కూడా సమర్పించవచ్చని కోర్టుకు తెలిపారు. కేంద్రం వాదనలపై స్పందించిన హైకోర్టు.. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చేవారు ఆరోగ్యసేతు యాప్‌ను తప్పనిసరిగా కలిగి ఉండాలనే నిబంధనకు సంబంధించి చట్టబద్ధత ఉంటే తెలియజేయాలని ఆదేశించింది. అనంతరం కేసు విచారణను జులై 10కి వాయిదా వేసింది. కట్టడికి కేంద్రం తీసుకొచ్చిన ఆరోగ్య సేతు యాప్‌పై పలు విమర్శలు, వివాదాలు నెలకున్న విషయం తెలిసిందే. దీని వల్ల వినియోగదారుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. దీనిపై న్యాయస్థానాల్లోనూ వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. అయితే, ప్రపంచ వ్యాప్తంగా మే నెలలో అత్యధికంగా డౌన్‌లోడ్‌ అయిన‌ టాప్‌ 10 మొబైల్‌ యాప్‌ల్లో ఆరోగ్యసేతు తన స్థానాన్ని నిలుపుకుంది. ‘ఆరోగ్యసేతు యాప్‌ను లాంచ్‌ చేసినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా డౌన్‌లోడ్‌ అయిన‌ టాప్‌-10 మొబైల్‌ యాప్‌ల్లో ఒకటిగా ఉంటుంది. కోవిడ్‌-19 మహమ్మారిపై పోరాటంలో సాంకేతిక పరిజానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడంలో భారతదేశం ముందుందని’ నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్‌ కాంత్ వారం రోజుల కిందట ట్వీట్‌ చేశారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3hn1OzT

Post a Comment

0 Comments