మరోసారి కరోనా విజృంభణ.. చైనాలో భారీగా నిర్ధారణ పరీక్షలు

రెండోసారి మహమ్మారి విజృంభణ నేపథ్యంలో చైనా అప్రమత్తమయ్యింది. రాజధాని బీజింగ్‌‌లో భారీగా కేసులు నమోదవుతుండటంతో నగరంలోని 90 వేల మంది స్థానికులకు కరోనా నిర్దారణ పరీక్షల చేయాలని భావించి.. సోమవారమే ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. స్థానిక షిన్‌ఫడీ హోల్‌సేల్‌ మటన్ మార్కెట్‌ను సందర్శించినవారిలో పలువురికి కొవిడ్‌ పాజిటివ్‌గా తేలుతున్న నేపథ్యంలో.. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను విధించింది. చైనాలో గత 24 గంటల్లో 49 కొత్త కేసులు నమోదయ్యాయి. వాటిలో 42 ఒక్క బీజింగ్‌లోనే నిర్ధారణ కావడం గమనార్హం. మరోవైపు, కరోనా పుట్టుకపై చైనా అధికారిక మీడియాలో మళ్లీ చర్చ మొదలైంది. షిన్‌ఫడీ మార్కెట్‌ను సందర్శించినవారిలో కరోనా వైరస్ నిర్ధారణ కావడంతో మహమ్మారి ఐరోపా నుంచి చైనాకు చేరుకున్నట్లు కనిపిస్తోందని.. దాని జన్యుక్రమాన్ని విశ్లేషించిన బీజింగ్‌ పరిశోధకుడు ప్రకటించడమే అందుకు కారణం. గతవారం రోజుల నుంచి స్థానికుల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నట్టు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. పెద్ద సంఖ్యలో బీజింగ్‌తోపాటు హుబే ప్రావిన్సుల్లోనూ కొత్తగా మూడు కేసులు నమోదయినట్టు తెలిపింది. విదేశాల నుంచి వచ్చివారిలో సోమవారం 10 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం చైనాలో కొత్త పాజిటివ్ కేసుల సంఖ్య 177కి చేరింది. గత నెలతో పోలిస్తే ఇది ఎక్కువే. షిన్‌ఫడీ మార్కెట్ పరిసరాల్లోని 46వేల మందికి కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించనుండగా.. ఇప్పటికే 10వేల మందికి పరీక్షలు పూర్తిచేశారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2MYHqqY

Post a Comment

0 Comments