కరోనా అనుమానిత లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన ఢిల్లీ ఆరోగ్య మంత్రి

ఢిల్లీ ఆరోగ్య మంత్రి తీవ్ర జ్వరంతో మంగళవారం ఉదయం హాస్పిటల్‌లో చేరారు. జ్వరంతోపాటు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న మంత్రి సత్యేంద్ర జైన్‌ను ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు తరలించారు. మంత్రికి నేడు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఆయనకు హాస్పిటల్‌లో చికిత్స కొనసాగుతోందని, ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఇక, తన అనారోగ్యం గురించి మంత్రి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘గత రాత్రి తీవ్రమైన జ్వరంతోపాటు ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది ఎదురయ్యి.. శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోయాయి.. దీంతో రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో చేరాను.. ఎప్పటికప్పుడు ఆరోగ్యం గురించి సమాచారం అందజేస్తాను’ అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కాగా, విజృంభణ, పరిస్థితులపై చర్చించేందుకు సోమవారం జరిగిన అఖిలపక్షం సమావేశానికి మంత్రి సత్యేంద్ర జైన్ హాజరయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో సత్యేంద్ర జైన్‌ అస్వస్థతకు గురవడం ఆందోళన వ్యక్తమవుతోంది. ఢిల్లీలో ఇప్పటివరకు 42,829 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 1400 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల్లో ప్రస్తుతం ఢిల్లీ మూడో స్థానంలో ఉంది. ఢిల్లీలో ప్రతి పది లక్షల మందికి 70.92 మంది చనిపోతున్నారు. ఇది జాతీయసగటు కంటే 10 రెట్లు ఎక్కువ. ఇప్పటికీ రోజువారీ కేసుల్లో 65%పైగా కేవలం ఢిల్లీ, ముంబయి, తమిళనాడు నుంచే వస్తున్నాయి. రోజువారీ వృద్ధిరేటు ఢిల్లీలో అత్యధికంగా ఉంది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3e9gvVe

Post a Comment

0 Comments