భారత్- నేపాల్ బంధం రోటీ-బేటీ లాంటిది.. ఎవరూ విడదీయలేరు: రాజ్‌నాథ్

భారత్‌ - నేపాల్‌ మధ్య నెలకున్న సరిహద్దు వివాదంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు అసాధారణమైనవనీ.. ఈ బంధాన్ని ప్రపంచంలో ఏ శక్తీ విచ్ఛిన్నం చేయలేదని ఉద్ఘాటించారు. సోమవారం ‘ఉత్తరాఖండ్ జన సంవాద్ ర్యాలీ’లో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడుతూ.. భారత్‌ - నేపాల్‌ మధ్య బంధం ‘రోటీ - బేటీ’ లాంటిదన్నారు. ఇరు దేశాల మధ్య ఏవైనా అపార్థాలు, పొరపొచ్చాలుంటే చర్చల ద్వారానే పరిష్కరించుకుంటామని పేర్కొన్నారు. ‘రహదారి నిర్మాణం విషయంలో నేపాల్‌లో కొంత అపార్థం చేసుకుంది.. లిపూలేఖ్‌ ప్రాంతంలో బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) నిర్మిస్తున్న రహదారి చాలా వరకు భారత సరిహద్దులోనే ఉందని’ రాజ్‌నాథ్ స్పష్టంచేశారు. నేపాల్‌తో సామాజిక, భౌగోళిక, చారిత్రక, సాంస్కృతిక సంబంధాలే కాకుండా ఆధ్యాత్మిక బంధం కూడా ఉందన్నారు. నేపాల్‌ పట్ల భారతీయుల్లో ఎలాంటి చేదుభావం ఉండదని మాత్రం చెప్పగలన్నారు. భారత్‌ - నేపాల్‌ మధ్య బంధం ఎంతో లోతైనదన్న ఆయన.. ఈ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకుందామని నేపాల్‌కు సూచించారు. భారత భూభాగాలైన లిపులేఖ్‌, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలను తమవిగా పేర్కొంటూ రూపొందించిన వివాదాస్పద కొత్త మ్యాప్‌కు నేపాల్‌ పార్లమెంట్‌లోని దిగువ సభ శనివారం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే, నేపాల్ చర్యలను భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. చారిత్రక ఆధారాలు, వాస్తవాలను పక్కన బెట్టి నేపాల్‌ వైఖరి పూర్తిగా ఏకపక్షంగా ఉందని మండిపడుతోంది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2MXG8fT

Post a Comment

0 Comments