పెరుగుతున్న కరోనా కేసులు.. మరోసారి కఠిన లాక్‌డౌన్ దిశగా ఆ రాష్ట్రాలు

దేశంలో క్రమంగా అంక్షలు సడలించడంతో మరోసారి మహమ్మారి ఉద్ధృతమవుతోంది. దీంతో కొన్ని రాష్ట్రాలు మరోసారి ఆంక్షలకు సిద్ధమవుతున్నాయి. మరికొన్ని పూర్తిగా షట్‌డౌన్‌‌కు మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. పంజాబ్‌లో తీవ్రత ఎక్కువకావడంతో వారాంతాలు, పబ్లిక్ హాలీడేస్‌లో లాక్‌డౌన్ కఠినంగా అమలుచేయాలని ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ గురువారం ఆదేశించారు. కేవలం ఈ-పాస్‌లు ఉన్నవారికి అనుమతించాలని స్పష్టం చేశారు. వైద్య సిబ్బంది, నిత్యావసరాల సేవల సిబ్బంది మినహా ప్రజలు ఈ-పాస్‌లు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. పారిశ్రామిక రంగంలో మాత్రం సాధారణ కార్యకలాపాలకు అనుమతులు కొనసాగుతాయని తెలిపారు. ఢిల్లీ నుంచి పంజాబ్‌కు వచ్చేవారికి కరోనా నిర్ధారణ పరీక్షలు సహా కఠినమైన ఆంక్షలు విధించడాన్ని పరిశీలించాలని వైద్య నిపుణులను అమరీందర్ సింగ్ కోరారు. ఢిల్లీ నుంచి రాష్ట్రానికి రోజుకు సగటున 500 నుంచి 800 వాహనాలు వస్తున్నట్టు తెలిపారు. చెన్నైలో కరోనా మహమ్మారి స్వైరవిహారం కొనసాగుతుండటంతో నగరంలో పూర్తిస్థాయి లాక్‌డౌన్ ఎందుకు విధించడం లేదని తమిళనాడు ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్టు గురువారం ప్రశ్నించింది. శుక్రవారంలోగా దీనిపై స్పందన తెలియజేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరింది. తమిళనాడులోని మొత్తం కేసుల్లో 70 శాతం (25వేలకుపైగా) చెన్నై నగరంలోనే నమోదయ్యాయి. గురువారం నాటికి అక్కడ 258 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. కేసుల సంఖ్యపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఝార్ఖండ్‌లోనూ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమలుచేయాలని ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్‌ను మిత్రపక్షం కాంగ్రెస్ కోరింది. అటు, కేరళ సైతం కఠినమైన ప్రమాణాలతో కంటెయిన్‌మెంట్ జోన్లను నిర్వచించే పద్దతిని రూపొందించాలని నిర్ణయించింది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3dQol69

Post a Comment

0 Comments