స్కూల్‌లోకి చొరబడిన ఆగంతకులు.. 400 మంది విద్యార్థులు కిడ్నాాప్

పది ఇరవై కాదు ఏకంగా 400 మంది విద్యార్థులను అపహరించిన ఘటన నైజీరియాలో చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి వాయువ్య నైజీరియాలోని కట్సినా రాష్ట్రంలో ఈ ఘటన జరిగినట్టు ఆ దేశ అధ్యక్షుడు ప్రకటించారు. కంకారా జిల్లాలోని గవర్న్‌మెంట్ సైన్స్ సెకెండరీ స్కూల్‌లోకి ఏకే-47 తుపాకులతో చొరబడిన కిడ్నాపర్లు వందలాది మందిని అపహరించినట్టు పోలీసులు, స్థానికులు తెలిపారు. మొత్తం ఈ పాఠశాలలో 800 మంది చదువుతుండగా.. వారిలో సగం మందిని ఎత్తుకెళ్లారని స్కూల్ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొన్నారు. మొహముద్ బుహారీ సొంత రాష్ట్రంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఈ ఘటనను ఖండించిన బుహారీ.. కిడ్నాపర్లను ఓ అటవీ ప్రాంతంలో గుర్తించినట్టు తెలిపారు. దుండగులు, సైన్యానికి మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయని, ఎయిర్‌ఫోర్స్ సాయం కూడా తీసుకున్నట్టు వెల్లడించారు. ఎంత మందిని అపహరించారు, మిస్సయినవారు ఎవరెవరు అనేది పోలీసులు, సైన్యం ఆరా తీస్తున్నాయి. విద్యార్థులను కిడ్నాపర్ల చెర నుంచి విడిపించడానికి పోలీసులు కాల్పులు జరిపినట్టు పోలీస్ అధికార ప్రతినిధి గాంబో ఇషా అన్నారు. ఈ ఆపరేషన్‌కు అదనపు బలగాలను రప్పిస్తున్నామని, ఎదురుకాల్పుల్లో ఓ అధికారి గాయపడ్డారని తెలిపారు. ప్రభుత్వం, బందిపోట్ల మధ్య జరుగుతున్న ఘర్షణలతో కట్సినా హింసకు కేంద్రంగా మారింది. స్థానికులపై దాడి చేసి, డబ్బుల కోసం అపహరించడం ఈ ముఠాలకు వెన్నతో పెట్టిన విద్య. మరోవైపు, ఈశాన్య ప్రాంతంలో ఇస్లామిక్ ఉగ్రవాదుల దాడులు సాధారణం. నైజీరియా అంతటా హింస, అభద్రత పౌరులను ఆగ్రహానికి గురిచేసింది. ముఖ్యంగా ఈశాన్య బోర్నో రాష్ట్రంలో ఇస్లామిక్ ఉగ్రవాదులు గత నెలాఖరులో చాలా మంది రైతులను అత్యంత దారుణంగా హత్యచేశారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3njDem9

Post a Comment

0 Comments