ప్రణబ్ ముఖర్జీ.. సైద్ధాంతిక నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం

భారత రాజకీయాలలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీలాంటి నాయకులు చాలా అరుదుగా కనిపిస్తారు. ఈ తరం యువత ఆయనను స్ఫూర్తిగా రాజకీయాల్లో ఎదగాలని కోరుకుంటారనడంలో సందేహం లేదు. ఐదు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆయన అధిరోహించని శిఖరాలు లేవు. 2012-2017 మధ్య భారత రాష్ట్రపతిగా పని చేసిన ప్రణబ్ ప్రతిభ ఏ ఒక్క రంగానికో పరిమితం కాలేదు. మంచి రాజకీయ నాయకుడిగానే కాదు, గొప్ప ఆర్ధికవేత్తగానూ గుర్తింపు తెచ్చుకున్నారు. భారత్‌కు రక్షణమంత్రిగా, ఆర్ధికమంత్రిగానూ ఆయన సేవలందించారు. ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి, తర్వాత జర్నలిజంలో కొన్నాళ్లు పనిచేశారు. అనేక భారతీయ బ్యాంకుల కమిటీలు, ప్రపంచ బ్యాంకు బోర్డులో కూడా సభ్యుడిగా ఉన్నారు. లోక్‌సభ స్పీకర్‌‌ సహా పలు ప్రభుత్వ కమిటీలకు చైర్మన్‌గా పని చేశారు. 1935 డిసెంబర్‌ 11న పశ్చిమబెంగాల్‌లోని మిరాఠీ గ్రామంలో ప్రణబ్‌ ముఖర్జీ జన్మించారు. ఆయన తండ్రి కమద్‌ కింకర్‌ ముఖోపాధ్యాయ్‌ స్వాతంత్ర్య సమరయోధులు. స్వరాజ్య పోరాటంలో పాల్గొని కొన్నాళ్లు జైలు జీవితం గడిపారు. కోల్‌కతా యూనివర్సిటీ నుంచి చరిత్రలో మాస్టర్స్ డిగ్రీ, రాజకీయ శాస్త్రంలో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తిచేసిన దాదా.. కాలేజీలో లెక్చరర్‌గా, జర్నలిస్టుగా కెరీర్‌ ప్రారంభించారు. ఇక, రాజకీయాల్లోకి వచ్చి 1969లో తన 34వ ఏట ప్రణబ్‌ ముఖర్జీ రాజ్యసభ సభ్యుడయ్యారు. ఇందిరాగాంధీ నేతృత్వంలో రాజకీయాలలో అడుగుపెట్టిన ప్రణబ్‌‌కు ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అయితే ఇందిరా గాంధీ హత్య అనంతరం రాజీవ్‌ ప్రధాని అయ్యాక ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. తన రాజకీయ ప్రస్థానం గురించి రాసుకున్న ‘ది టర్బులెంట్ ఇయర్స్‌ 1980-1996’పుస్తకంలో ఆయన దీని గురించి ప్రస్తావించారు. ‘నేను రాజీవ్‌ నుంచి పిలుపు కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. రాజీవ్‌ నన్ను క్యాబినెట్ నుంచి పక్కనపెడతారని అనుకోలేదు.. అలాంటి ఊహాగానాలు కూడా వినపడలేదు. కానీ నాకు మంత్రి పదవి రాలేదని విని షాకయ్యాను. నమ్మలేక పోయాను’ అని రాసుకున్నారు. కొన్ని కారణాలతో కాంగ్రెస్ నుంచి 1982లో బహిష్కరణకు గురయ్యారు. ‘ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ’ పత్రిక కోసం రిపోర్టర్ ప్రీతిష్‌ నందికి ఇంటర్వ్యూ ఇవ్వడంపై అధిష్ఠానం అసంతృప్తి వ్యక్తం చేసి, ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించింది. 1988లో తిరిగి పార్టీలోకి వచ్చినా, 1991లో పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాతే ఆయనకు మంచి రోజులు మొదలయ్యాయి. 2004లో కాంగ్రెస్‌ తిరిగి అధికారంలోకి రావడం.. ప్రధాని పదవిని చేపట్టడానికి సోనియా విముఖత చూపడంతో ఆ సమయంలో ప్రణబ్‌ ముఖర్జీ పేరు చర్చకు వచ్చింది. ఈ విషయాన్ని కొయిలేషన్ ఇయర్స్ 1995-2012 అనే పుస్తకంలో ప్రణబ్ రాశారు. కానీ ప్రణబ్ ప్రధాని కాలేదు. కానీ ఆర్ధికమంత్రిగా, రక్షణమంత్రి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు సన్నిహితంగా పని చేశారు. "మిస్టర్‌ డిపెండబుల్‌''గా ఆయన ప్రభుత్వంలో తన స్థానాన్ని మరోసారి నిరూపించుకున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించాక 2014లో వచ్చిన మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంతో కూడా ఆయన సత్సంబంధాలు కొనసాగించారు. తన తుదిశ్వాస వరకు ప్రణబ్‌ ముఖర్జీ నిఖార్సయిన ప్రజాస్వామిక వాదిగానే జీవించారు. సిద్ధాంతాల మీద కాకుండా, అవసరాలు, పదవుల ఆధారంగా రాజకీయాలు నడుస్తున్న నేటి కాలంలో సైద్ధాంతిక నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనంగా ప్రణబ్‌ ముఖర్జీ చరిత్రలో మిగిలి పోయారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3n9f2mx

Post a Comment

0 Comments