కమల్ హాసన్ పార్టీతో ఒవైసీ పొత్తు.. హైదరాబాద్‌లో కీలక చర్చలు!

మల్ హాసన్‌ పార్టీతో ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ పొత్తు పెట్టుకోనున్నారా? ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఎంఐఎం వర్గాల నుంచి దీనికి ఔననే సమాధానం వస్తోంది. తమిళనాడులో 2021 ఏప్రిల్‌ లేదా మేలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్‌కు చెందిన మక్కల్‌ నీది మయ్యమ్‌ ‌పార్టీతో కలిసి పోటీ చేయడానికి అవకాశాలు కూడా ఉన్నట్లు వర్గాలు తెలిపాయి. మక్కల్ నీది మయ్యమ్ (MNM) పార్టీ వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో ఎంఐఎం పార్టీకి చెందిన నేతలతో సోమవారం (డిసెంబర్ 14) హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో భేటీ అయ్యారు. ఆ రాష్ట్ర ఎన్నికలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 25 స్థానాలకు తగ్గకుండా ఎంఎంఐ పోటీ చేయాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బిహార్ ఎన్నికల ఫలితాల అనంతరం ఎఐఎం అధినేత జోరు పెంచారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఓటు శాతాన్ని పెంచుకునే దిశగా దృష్టి సారించారు. ఈ క్రమంలో త్వరలో ఎన్నికలు జరుగనున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు సంబంధించి కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. తమిళనాడులో మైనార్టీ జనాభా ఎక్కువగా ఉన్న వెల్లూర్‌, రాణీపేట్‌, తిరపత్తూర్‌, క్రిష్ణగిరి, రామనాథపురం, పుదుకొట్టై, తిరుచ్చి, మధురై, తిరునల్వేలి జిల్లాలపై ఒవైసీ ప్రధానంగా దృష్టి సారించారు. ఇటీవల బిహార్‌ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన ఎంఐఎం పార్టీ అక్కడ 5 స్థానాల్లో విజయం సాధించింది. గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్ ఎన్నికల్లో 44 స్థానాల్లో గెలిచి తన సత్తా చాటింది. ఇంతకుముందు మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసి కొన్ని స్థానాలను కైవసం చేసుకుంది. వాస్తవానికి తమిళనాడులో కొన్ని ముస్లిం పార్టీలు ఉన్నాయి. కానీ, అవి ఎలాంటి ప్రభావం చూపలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీలను అన్నింటినీ ఒకేదాటిపైకి తెచ్చి ఎన్నికల్లో పాల్గొనాలని ఒవైసీ యోచిస్తున్నారు. దీంతో పాటు కలిసి వచ్చే పార్టీలతోనూ జతకట్టాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో మక్కల్‌ నీది మయ్యమ్‌, నామ్ తమిళర్‌ లాంటి పార్టీలతో పొత్తు పెట్టుకోవడానికి కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. బిహార్ ఎన్నికల్లోనూ ఇదే తరహా విధానం అనుసరించి ప్రభావం చూపగలిగారు. ఆ విషయంలో ఇద్దరిదీ ఒకే దారి.. క‌మ‌ల్‌ హాసన్‌తో అస‌ద్ పొత్తు అంశం రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తికర చర్చకు తావిస్తోంది. బీజేపీని వ్యతిరేకించే విష‌యంలో ఈ ఇద్దరు నేతలు ఇంచుమించు ఒకేలా స్పందిస్తుంటారు. మహాత్మా గాంధీని చంపిన గాడ్సే ఓ ఉగ్రవాది అంటూ క‌మ‌ల్ హాస‌న్ గతంలో సంచలన వ్యాఖ్యలు చేయగా.. అస‌దుద్దీన్ ఒవైసీ ఆ వ్యాఖ్యలతో ఏకీభ‌వించారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3mpHBuV

Post a Comment

0 Comments