పరీక్షలు రద్దుచేసేలా ఆదేశించాలని సుప్రీం చీఫ్ జస్టిస్‌కు విద్యార్థులు లేఖ

కోవిడ్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో పరీక్షలు నిర్వహించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తీసుకున్న నిర్ణయాన్ని రద్దుచేయాలని కోరుతూ ప్రధాన న్యాయమూర్తికి 12వ తరగతి విద్యార్థులు లేఖ రాశారు. ప్రస్తుత సమయంలో భౌతికంగా హాజరయ్యేలా పరీక్షలు నిర్వహించడానికి సీబీఎస్ఈ ప్రయత్నిస్తోందని దాదాపు 300 మంది విద్యార్థులు రాసిన ఈ లేఖలో పేర్కొన్నారు. దీనికి బదులు ప్రత్యామ్నాయ మార్గాన్ని అమలుచేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించాలని కోరారు. సీబీఎస్ఈ 12 వ తరగతి పరీక్షల నిర్వహణపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీ సమావేశమై చర్చించిన కొద్ది రోజుల్లోనే విద్యార్థులు సీజేఐకి లేఖ రాయడం గమనార్హం. పరీక్షల నిర్వహణపై పూర్తిస్థాయిలో సూచనలు ఇవ్వాలని అన్ని రాష్ట్రాలనూ కేంద్రం కోరింది. సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణ, తేదీ, విధి విధానాలను మే 30న కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ప్రకటించే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. కోవిడ్ కారణంగా 12వ తరగతి పరీక్షలను సీబీఎస్ఈ వాయిదా వేసింది. పరీక్షల నిర్వహణకు సంబంధించిన పూర్తి సమాచారం జూన్ 1 న విద్యార్థులకు సీబీఎస్ఈ అందజేయనుంది. కోవిడ్ రెండో దశ వ్యాప్తి నేపథ్యంలో ముందు జాగ్రత్తగా కేంద్రం సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలు మే 4న ప్రారంభమై జూన్ 14న ముగియాల్సి ఉంది. అయితే కరోనా నేపథ్యంలో ఈ పరీక్షలను వాయిదా వేస్తూ ఏప్రిల్ 14న ప్రకటించారు. కొత్త తేదీలను తర్వాత ప్రకటిస్తామని వెల్లడించారు. అయితే దేశంలో కరోనా విజృంభణ ఏ మాత్రం తగ్గకపోవడంతో సీబీఎస్ఈ 12 వ తరగతి పరీక్షలు రద్దు చేయనున్నారంటూ వార్తలు జోరుగా వినిపించడంతో బోర్డు స్పందించింది. పరీక్షలు రద్దు అవుతాయంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని బోర్డు అధికారులు తేల్చిచెప్పారు. ఇప్పటివరకు అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదని స్పష్టం చేశారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2TkrTbw

Post a Comment

0 Comments