New IT Rules భారత్‌లో భావప్రకటన స్వేచ్ఛకు భారీ ముప్పు.. ట్విట్టర్ సంచలన వ్యాఖ్యలు

కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కొత్త ఐటీ మార్గదర్శకాలపై సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్ ఎట్టకేలకు నోరు విప్పింది. వ్యవహారంపై కేంద్రం, ట్విట్టర్ మధ్య వివాదం కొనసాగుతున్న వేళ.. సోషల్ మీడియా వేదిక స్పందించింది. భావ ప్రకటనా స్వేచ్ఛ, పోలీసుల బెదిరింపు ముప్పుపై ఆందోళన వ్యక్తం చేసింది. ‘చట్టానికి లోబడి ఉండటానికి ప్రయత్నిస్తామన్న ట్విట్టర్.. భావప్రకటన స్వేచ్ఛను నిరోధించే నిబంధనలలో మార్పులు చేయాలని కోరింది. కొత్త ఐటీ నిబంధనలపై ట్విట్టర్ మాట్లాడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ నిబంధనలపై ఇప్పటికే ‘వాట్సాప్’ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇవి రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని, వినియోగదారుల భద్రతకు వ్యతిరేకంగా ఉన్నాయని వాదిస్తోంది. ‘‘ట్విట్టర్ భారత ప్రజల అభిమతానికి కట్టుబడి ఉంది. మహమ్మారి సమయంలో మా సర్వీసు ప్రజా సంభాషణకు కీలకమైంది.. ప్రజలకు మద్దతునిస్తుందని నిరూపణయ్యింది. వీటిని అందుబాటులో ఉంచడానికి భారత్‌లో వర్తించే చట్టానికి లోబడి ఉండటానికి ప్రయత్నిస్తాం. కానీ, ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్నట్టే సేవల్లో పారదర్శకత, ప్రతి గొంతుకను శక్తివంతం చేయాలనే నిబద్ధత.. చట్ట నిబంధనల్లో భావ ప్రకటనా స్వేచ్ఛ, గోప్యతను పరిరక్షించే సూత్రాల ద్వారా మేం ఖచ్చితంగా మార్గనిర్దేశం చేస్తాం’’ అని ట్విట్టర్ అధికార ప్రతినిధి తెలిపారు. ‘‘ప్రస్తుతం భారతదేశంలోని మా ఉద్యోగులకు సంబంధించి ఇటీవలి సంఘటనలు, మేము సేవలందిస్తున్న వ్యక్తుల భావ ప్రకటనా స్వేచ్ఛకు ఏర్పడిన ముప్పు గురించి ఆందోళన చెందుతున్నాం.. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పౌర సమాజంలో సేవల నిబంధనలను అమలు చేయడానికి ప్రతిస్పందనగా పోలీసులు బెదిరించే వ్యూహాలను ఉపయోగించడం గురించి, అలాగే కొత్త ఐటీ నిబంధనల ముఖ్య అంశాలపై మాకు ఆందోళన ఉంది’’ అని వ్యాఖ్యానించారు. ‘‘భావ ప్రకటన, వ్యక్తిగత స్వేచ్ఛను నిరోధించే ఈ నిబంధనల్లో మార్పులు కోరుకుంటున్నాం.. మేము భారత ప్రభుత్వంతో మా నిర్మాణాత్మక సంభాషణను కొనసాగిస్తాం.. సహకార విధానాన్ని అవలంబించడం చాలా క్లిష్టమైనదని నమ్ముతున్నాం. ప్రజా ప్రయోజనాలను పరిరక్షించడం ఎన్నుకోబడిన అధికారులు, సంస్థలు, పౌర సమాజాల సమిష్టి బాధ్యత’’ అని స్పష్టం చేసింది. కోవిడ్‌ కట్టడిలో మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలను ఎలా ఎండగట్టాలో వివరిస్తూ కాంగ్రెస్‌ ఓ టూల్‌కిట్‌ను రూపొందించింది. దీనిపై బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా స్పందిస్తూ.. కేవలం ప్రచార యావతోనే విమర్శిస్తూ ఓ డాక్యుమెంట్‌ను ట్విటర్‌లో షేర్‌ చేశారని దుయ్యబట్టారు. సంబిత్ చేసిన ఆ ట్వీట్‌కు ‘కల్పిత మీడియా’ అనే ట్యాగ్‌ను ట్విటర్‌ జతచేసింది. ఈ ట్యాగ్‌ను ట్విట్టర్ జోడించడంపై కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ట్విట్టర్ పక్షపాత ధోరణి అవలంభిస్తోన్నట్టు ఉందని, దీనిని తక్షణమే తొలగించాలంటూ ఘాటు లేఖ రాసింది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3fqrBZb

Post a Comment

0 Comments