CBI Director ఎంపిక: జస్టిస్ ఎన్వీ రమణ కొత్త ప్రతిపాదన.. లిస్ట్ నుంచి ఈ ఇద్దరూ ఔట్!

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కొత్త డైరెక్టర్‌ ఎంపికపై ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో ఉన్నత స్థాయి కమిటీ సోమవారం సాయంత్రం సమావేశమైంది. ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, ప్రధాన ప్రతిపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌధురి సమావేశమై ముగ్గురి పేర్లను షార్ట్‌లిస్ట్‌ చేసినట్టు సమాచారం. కొత్త డైరెక్టర్‌గా 1984-87 బ్యాచ్‌లకు చెందిన 109 మంది అధికారుల పేర్లను పరిగణనలోకి తీసుకున్నారు. గంటన్నర పాటు జరిగిన ఉన్నతస్థాయి కమిటీ సమావేశంలో ముగ్గురు అధికారుల పేర్లను షార్ట్‌ లిస్ట్‌ చేసినట్టు తెలుస్తోంది. వీరిలో ఉత్తర్‌ప్రదేశ్‌ డీజీపీ హెచ్‌సీ అవస్తీ (1985 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి) సశస్త్ర సీమ బల్‌ (ఎస్‌ఎస్‌బీ) డీజీ కేఆర్‌ చంద్ర, కేంద్ర హోం మంత్రిత్వశాఖ ప్రత్యేక కార్యదర్శి (అంతర్గత భద్రత) వీఎస్‌కే కౌముది పేర్లు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, ప్రభుత్వం షార్ట్ లిస్ట్ చేసిన కనీసం ఇద్దరు ముఖ్య అభ్యర్థులను తొలగించే నిబంధనను చీఫ్ నొక్కిచెప్పినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కొత్తగా ఎంపికైన డెరెక్టర్ రెండేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగుతారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే సీబీఐ డైరెక్టర్‌ ఆర్‌కే శుక్లా పదవీకాలం ముగియడంతో సీనియర్‌ అధికారి, సంయుక్త డైరెక్టర్‌ ప్రవీణ్ సిన్హా తాత్కాలిక డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. వాస్తవానికి నాలుగు నెలల ముందే సీబీఐ కొత్త చీఫ్‌ ఎంపికను ఉన్నతస్థాయి కమిటీ చేపట్టాల్సి ఉన్నప్పటికీ ఆలస్యమైంది. సీనియారిటీ, అవినీతి కేసుల విచారణలో అనుభవం తదితర అంశాలను కొత్త డైరెక్టర్‌ ఎంపికలో పరిగణనలోకి తీసుకోనున్నారు. సీబీఐ డైరెక్టర్‌ ఎంపికలో ఇంతకు ముందెన్నడూ పేర్కొనని ‘ఆరు నెలల పాలన’ను ప్రధాన న్యాయమూర్తి లేవనెత్తారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ గతంలో సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావించారు. ఆరు నెలల్లోపు పదవీవిరమణ చేయబోయే అధికారులు పోలీస్ చీఫ్ పదవులకు పరిగణనలోకి తీసుకోరాదని, ఎంపిక కమిటీ తప్పనిసరిగా చట్టానికి లోబడి ఉండాలని పేర్కొన్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ ప్రతిపాదనకు కమిటీలోని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత అధీర్ రంజన్ చౌధురి మద్దతు తెలిపారు. ఆగస్టు 31న పదవీవిరమణ చేయబోయే బీఎస్ఎఫ్ చీఫ్ రాకేశ్ అస్థానా, మే 31తో పదవీకాలం ముగియనున్న ఎన్ఐఏ చీఫ్ వైసీ మోదీ పేర్లు ప్రభుత్వం షార్ట్ లిస్ట్‌ చేసిన జాబితా టాప్‌లో ఉన్నారు. వీరితోపాటు సీఐఎస్ఎఫ్ చీఫ్ సుబోధ్ కుమార్ జైస్వాల్‌ పేరు కూడా ఉంది. జస్టిస్ ఎన్వీ రమణ అభ్యంతరంతో వీరిని పక్కనబెట్టారు. కేంద్రం షార్ట్ లిస్ట్ చేసిన పేర్లకు అధీర్ రంజన్ చౌధురి మద్దతు తెలిపారు.. కానీ, జాబితా రూపొందించడంలో ప్రభుత్వం సాధారణం విధానాన్ని అనుసరించిందని ఆరోపిస్తూ ఒక అసమ్మతి నోట్ పెట్టారు. ‘‘అనుసరించిన విధానం కమిటీ ఆదేశానికి విరుద్ధంగా ఉంది.. మే 11న 109 పేర్లు ఇచ్చాం.. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు 10 మంది, 4 గంటలకు ఆరుగురు అధికారుల జాబితాను షార్ట్‌లిస్ట్ చేశారు.. అయితే పర్సనల్ అండ్ ట్రెయినింగ్ విభాగం అనుసరించిన ఈ విధానం అత్యంత అభ్యంతరకరమైంది’’ అని అధీర్ పేర్కొన్నారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3hSepy2

Post a Comment

0 Comments