Unnao Teenపై పోలీసుల పైశాచికం.. బాధితుడు మృతితో అధికారులు కీలక నిర్ణయం

కరోనా కట్టడికి విధించిన కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన యువకుడి పట్ల అమానవీయంగా ప్రవర్తించి, అతడి మరణానికి కారణమైన యూపీ పోలీసులపై వేటు పడింది. ఉన్నావ్ జిల్లాల్లోని బంగార్మౌ పట్టణంలో 17 ఏళ్ల బాలుడి శుక్రవారం ఉదయం కూరగాయలు అమ్ముకుంటుండగా.. కర్ఫ్యూ ఆంక్షలను ఉల్లంఘించాడని ఆరోపిస్తూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఇష్టమొచ్చినట్టు కొట్టారు. తీవ్ర గాయాలతో ఆ బాలుడు ఇంటికి చేరుకోగా.. అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అతడిని చికిత్స కోసం కుటుంబసభ్యులు సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు. లక్నో జాతీయ రహదారిపై బైఠాయించి, పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. పోలీసుల చర్యలపై దుమారం రేగడంతో ఉన్నతాధికారులు స్పందించారు. ఈ ఘటనకు కారకులైన ఇద్దరు కానిస్టేబుళ్లు, ఓ హోంగార్డును స్పస్పెండ్ చేస్తూ శనివారం ప్రకటన వెలువరించారు. హోంగార్డును ఉద్యోగం నుంచే తొలగిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. ఇద్దరు కానిస్టేబుళ్లు, ఓ హోంగార్డును స్పస్పెండ్ చేశామని, ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. కరోనా కట్టడికి యూపీ ప్రభుత్వం మే 24 వరకు లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. బాధితుడు మహమ్మద్ ఫైజల్ శుక్రవారం మధ్యాహ్నం లాక్‌డౌన్ సడలింపు సమయం ముగిసినా కూరగాయలు అమ్ముతున్నాడనే నేపంతో కానిస్టేబుళ్లు విజయ్ చౌధరి, హోంగార్డు సత్య ప్రదేశ్‌లు విచక్షణారహితంగా కొట్టారు. పోలీసులు తమ కుమారుడ్ని కొడుతున్న విషయం తెలుసుకుని అక్కడకు చేరుకునేలోపే తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలించారని ఫైజల్ తండ్రి మహమ్మద్ ఇస్లామ్ అరోపించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాయంత్రం 4.30 ప్రాంతంలో మృతిచెందాడని అన్నారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3f8anzu

Post a Comment

0 Comments